డుడుమకు జలకళ
ABN , Publish Date - Aug 06 , 2026 | 12:39 AM
ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ జలాశయం వరద నీటితో కళకళలాడుతోంది.
జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 2,590 అడుగులు కాగా, 2,585కు చేరిక
ముంచంగిపుట్టు, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ జలాశయం వరద నీటితో కళకళలాడుతోంది. డుడుమ జలాశయం 2,590 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం 2,585 అడుగుల నీటిమట్టం నమోదైందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అయితే దీని ఎగువ ప్రాంతంలో ఉన్న జోలాపుట్టు ప్రధాన జలాశయంలో ఆశించిన స్థాయిలో నీరు లేక వెలవెలబోతోంది. జోలాపుట్టు జలాశయం 2,750 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా, బుధవారం 2,719.80 అడుగుల నీటిమట్టం నమోదైంది. గతేడాది ఇదే సమయానికి 2,740.25 అడుగుల నీరు ఉండేదని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. రెండు జలాశయాల నుంచి నీటిని విడుదల చేయడం లేదని, విద్యుదుత్పాదనకు అవసరమైన నీటిని మాత్రమే డుడుమ నుంచి విడుదల చేస్తున్నామని తెలిపారు.