ఆర్కే బీచ్లో ప్రైవేటు ఫొటోగ్రాఫర్లకు ఇకపై డ్రెస్ కోడ్
ABN , Publish Date - Jul 09 , 2026 | 01:10 AM
బీచ్లో ప్రైవేటు ఫొటోగ్రాఫర్లకు డ్రెస్ కోడ్ అమలు చేయనున్నట్టు త్రీటౌన్ సీఐ జె.అప్పలనాయుడు తెలిపారు. ఆర్కే బీచ్లో సందర్శకులకు, ఫొటోగ్రాఫర్లకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఫొటోగ్రాఫర్ తమ పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ సందర్శకులు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.
పర్యాటకులతో మర్యాదగా ప్రవర్తించాలని త్రీటౌన్ సీఐ అప్పలనాయుడు
విశాఖపట్నం, జూలై 8 (ఆంధ్రజ్యోతి):
బీచ్లో ప్రైవేటు ఫొటోగ్రాఫర్లకు డ్రెస్ కోడ్ అమలు చేయనున్నట్టు త్రీటౌన్ సీఐ జె.అప్పలనాయుడు తెలిపారు. ఆర్కే బీచ్లో సందర్శకులకు, ఫొటోగ్రాఫర్లకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఫొటోగ్రాఫర్ తమ పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ సందర్శకులు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల సీఐగా బాధ్యతలు చేపట్టిన అప్పలనాయుడు ఆర్కేబీచ్, కాళీమాత ఆలయం పరిసరాల్లో బీచ్లో ఫొటోలు తీసేవారితో సమావేశం ఏర్పాటుచేశారు. బీచ్లో 150 మంది వరకూ ఫొటోగ్రాఫర్లు వరకూ ఉన్నట్టు పోలీసులు వివరాలు సేకరించారు. వారందరూ గురువారం నుంచి విధిగా డ్రెస్కోడ్ పాటించాల్సిందేనని సీఐ స్పష్టంచేశారు. విశాఖ అంటేనే బీచ్ గుర్తుకొస్తుందని, నగరానికి వచ్చేవారంతా కచ్చితంగా బీచ్ను సందర్శిస్తారు కాబట్టి ఫొటోగ్రాఫర్లు వారిపట్ల గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. కొందరు ఫొటోగ్రాఫర్ల చర్యలు, అనుచిత ప్రవర్తన కారణంగా అందరికీ నష్టం కలుగుతుందన్నారు. సందర్శకులతో మర్యాదగా వ్యవహరిస్తామని, హద్దుమీరి ప్రవర్తించినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా రూ.లక్ష జరిమానా చెల్లించేందుకు సమ్మతిస్తున్నట్టు బైండోవర్ పత్రాలను సమర్పించాలని ఆదేశించారు.