పన్నుల వసూళ్లలో జిల్లా ఫస్ట్
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:36 PM
పన్నులు, పన్నుయేతర వసూళ్లలో రాష్ట్రస్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి కె.పూర్ణచంద్రశేఖర్ తెలిపారు.
పాడేరురూరల్, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): పన్నులు, పన్నుయేతర వసూళ్లలో రాష్ట్రస్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి కె.పూర్ణచంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 244 గ్రామ పంచాయతీలు, 3,461 హాబిటేషన్లు ఉన్నాయన్నారు. చరిత్రలో తొలిసారిగా 244 పంచాయతీలకు గాను 240 గ్రామ పంచాయతీల్లో 100 శాతం పన్నులు వసూలు చేయడం జిల్లా పరిపాలనకు గర్వకారణంగా ఉందన్నారు. డిప్యూటీ ఎంపీడీవోలు, డీఎల్పీవోలు, డీడీవోలు, పంచాయతీ అభివృద్ధి అధికారులు(పీడీవో)లు సమష్టిగా కృషి చేయడం వల్లే ఈ విజయాన్ని సాధించగలిగామన్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఉత్తమంగా పనిచేసిన పంచాయతీ అభివృద్ధి అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ క్రమంలో జిల్లా పంచాయతీ అధికారి పూర్ణచంద్రశేఖర్ను అధికారులు, సిబ్బంది సత్కరించారు.