మన్యంలో విభిన్న వాతావరణం
ABN , Publish Date - Mar 15 , 2026 | 10:53 PM
వాతావరణంలోని మార్పుల కారణంగా మన్యంలో గత రెండు రోజులుగా విభిన్న వాతావరణం నెలకొంటున్నది.
ఉదయం దట్టంగా పొగమంచు
సాయంత్రం భారీ వర్షం
పాడేరు, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): వాతావరణంలోని మార్పుల కారణంగా మన్యంలో గత రెండు రోజులుగా విభిన్న వాతావరణం నెలకొంటున్నది. ఆదివారం ఉదయం దట్టంగా పొగమంచు, తొమ్మిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు ఎండ, ఆ తర్వాత నుంచి ఆకాశం మబ్బులు పట్టి ముసురు వాతావరణం నెలకొంది. సాయంత్రం ఐదు గంటల తర్వాత అరకులోయ, డుంబ్రిగుడ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇతర ప్రాంతాల్లో రాత్రి అక్కడక్కడ జల్లులు, ఒక మోస్తరుగా వర్షం పడింది. దీంతో వాతావరణం కాస్తా చల్లబడింది.
అరకులోయలో 14.2 డిగ్రీలు
మన్యంలో పలుచోట్ల వర్షం కురిసినప్పటికీ కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు లేదు. ఆదివారం అరకులోయలో 14.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ముంచంగిపుట్టులో 15.4, చింతపల్లిలో 16.8, పెదబయలులో 17.2, జి.మాడుగులలో 17.3, కొయ్యూరులో 18.9, అనంతగిరిలో 21.5 డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.