చింతపండుకు గిరాకీ
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:51 PM
స్థానిక ఆదివారం సంతలో చింతపండుకు గిరాకీ పెరిగింది. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది ధర ఆశాజనకంగా ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గతంతో పోలిస్తే ఆశాజనకంగా ధర
ప్రస్తుతం సంతలో 10 కిలోలు రూ.800-900 మధ్య అమ్మకం
దేవరాపల్లి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఆదివారం సంతలో చింతపండుకు గిరాకీ పెరిగింది. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది ధర ఆశాజనకంగా ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పది కిలోలు రూ.300 నుంచి రూ.500 వరకు పలకగా, ఈ ఏడాది సీజన్ మొదటి నుంచి పది కిలోలు రూ.800 నుంచి రూ.900 వరకు పలికింది. రైతులు ఆదివారం ఉదయం 7 గంటలకే సంతకు చింతపండు తీసుకు వచ్చారు. గిరిజన ప్రాంతంలో కోతులు చింతపండుకు నష్టం కలిగించాయి. దీంతో మైదాన ప్రాంతం నుంచి వచ్చిన చింతపండుకు గిరాకీ పెరిగింది. దేవరాపల్లి చింతపండు కోసం అనకాపల్లి, కె.కోటపాడు, విజయనగరం జిల్లా వేపాడ మండలం, కొత్తవలస పరిసర ప్రాంతాల నుంచి వినియోగదారులు వచ్చి ఏడాదికి సరిపడా అవసరాల కోసం కొనుగోలు చేసుకున్నారు. దీంతో ఆదివారం సంత కిటకిటలాడింది.