డిగ్రీ లెక్చరర్ పరీక్ష ఫలితాలు విడుదల
ABN , Publish Date - Aug 16 , 2026 | 01:02 AM
డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల నియామకానికి నిర్వహించిన పరీక్షల (గ్రూప్-1) ఫలితాలను ఏపీపీఎస్సీ శుక్రవారం రాత్రి విడుదల చేసింది.
ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పలువురు ఎంపిక
విశాఖపట్నం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి):
డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల నియామకానికి నిర్వహించిన పరీక్షల (గ్రూప్-1) ఫలితాలను ఏపీపీఎస్సీ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. నెల రోజుల కిందట ఎకనామిక్స్, బయో టెక్నాలజీ, తెలుగు, జువాలజీ, కెమిస్ర్టీ సబ్జెక్టులకు సంబంధించిన ఫలితాలు రాగా, ఇప్పుడు మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, మైక్రోబయాలజీ సబ్జెక్టులకు సంబంధించిన ఫలితాలు వచ్చాయి. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పలువురు జోన్-1తోపాటు ఇతర జోన్లలో పోస్టులకు ఎంపికయ్యారు. ఏయూ రీసెర్చ్ విద్యార్థిని బి.శ్రావణి మ్యాథమెటిక్స్ లెక్చరర్ పోస్టుకు ఎంపికయ్యారు. ఏయూలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన శ్రావణి టాపర్గా నిలిచి గోల్డ్ మెడల్ అందుకున్నారు. ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్నారు. గైడ్ కె.రాజేంద్రప్రసాద్, భర్త బూరాడ శ్రీనివాసరావు సహకారం, ప్రోత్సాహంతో ఈ విజయం సాధించినట్టు ఆమె తెలిపారు. ఎమ్మెస్సీ పూర్తయినప్పటి నుంచి స్పష్టమైన లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం చదివినట్టు శ్రావణి తెలిపారు.
డీసీసీబీ ఉద్యోగులకు వేతన బకాయిలు విడుదల
ఆంధ్రజ్యోతి ఎఫెక్టు
విశాఖపట్నం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి):
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఉద్యోగులకు ఎట్టకేలకు వేతన బకాయిలు (ఎరియర్స్) విడుదల చేశారు. వేతన సవరణ అనంతరం 2022 నవంబరు నుంచి ప్రతి ఉద్యోగి/అధికారికి సగటున రూ.రెండు నుంచి రూ.మూడున్నర లక్షల వరకు బకాయిలు అందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ‘బకాయిల కోసం ఎదురుచూపు’ శీర్షికతో ఈనెల ఎనిమిదో తేదీన ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో పాలకులు స్పందించారు. శుక్రవారం సాయంత్రం సుమారు రూ.ఎనిమిది కోట్ల ఎరియర్స్ ఉద్యోగులు/అధికారుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. సొమ్ములు వ్యక్తిగత ఖాతాలకు జమకావడంతో ఉద్యోగులు, అధికారులు స్వాగతించారు.