చెత్త నుంచి సంపద సృష్టి
ABN , Publish Date - May 16 , 2026 | 10:56 PM
చెత్త నుంచి సంపద సృష్టికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి అన్నారు.
కలెక్టర్ నిషాంతి
కిండంగి సంపద కేంద్రం పరిశీలన
పాడేరు, మే 16(ఆంధ్రజ్యోతి): చెత్త నుంచి సంపద సృష్టికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. స్వచ్చాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలో కిండంగి గ్రామంలోని చెత్త సంపద కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా అక్కడున్న వర్మీ కంపోస్ట్ యూనిట్ను ఆసక్తిగా పరిశీలించి, వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడ సేకరించిన చెత్తను వేర్వేరుగా నిల్వ చేసినవి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... చెత్త నుంచి సంపద సృష్టికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వర్మీ కంపోస్ట్ తయారీ, వినియోగం పెరగాలని, ఇందుకు అధికారులు కృషిచేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం చెత్త సంపద కేంద్రం ఆవరణలోని గాంధీ విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జిల్లా పంచాయతీ అధికారి కేపీ.చంద్రశేఖర్, డీఎల్పీవో పీఎస్.కుమార్, ఎంపీడీవో రతన్తేజ్, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.