గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:28 AM
గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపినట్టు హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో పట్టుబడిన 20,876 కిలోల గంజాయి, 23.68 కిలోల లిక్విడ్ గంజాయిని అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఫార్మాసిటీలో గల కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు (సీడబ్ల్యూఎంపీ)లోని ఇన్సిరేషన్ ప్లాంటులో శాస్త్రీయ పద్ధతిలో దహనం చేసే ప్రక్రియను గురువారం డీఐజీ గోపినాథ్జెట్టి, పలువురు ఎస్పీలతో కలిసి ఆమె ప్రారంభించారు.
హోం మంత్రి అనిత
శాస్త్రీయ పద్ధతిలో 20,876 కిలోల గంజాయి దహనం
విశాఖ రేంజ్ ఐజీతో పాటు పలువురు ఎస్పీలు హాజరు
పరవాడ (అనకాపల్లి జిల్లా), జూన్ 18 (ఆంధ్రజ్యోతి): గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపినట్టు హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో పట్టుబడిన 20,876 కిలోల గంజాయి, 23.68 కిలోల లిక్విడ్ గంజాయిని అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఫార్మాసిటీలో గల కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు (సీడబ్ల్యూఎంపీ)లోని ఇన్సిరేషన్ ప్లాంటులో శాస్త్రీయ పద్ధతిలో దహనం చేసే ప్రక్రియను గురువారం డీఐజీ గోపినాథ్జెట్టి, పలువురు ఎస్పీలతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగును ఇప్పటికే పూర్తిగా అరికట్టడం జరిగిందన్నారు. గత 18 నెలల కాలంలో ఐదుసార్లు వేల కిలోల గంజాయిని ధ్వంసం చేశామని వెల్లడించారు. గంజాయి, మాదక ద్రవ్యాల బారినపడకుండా యువతను రక్షించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. గంజాయి సాగు, రవాణాను అరికట్టేందుకు విశాఖ రేంజ్ పరిధిలో ఉన్న పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు. గంజాయిపై ప్రజలకు వినూత్న కార్యక్రమాలతో అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. గంజాయి కట్టడికి చేపట్టిన చర్యలు, అవగాహన కార్యక్రమాలకు చెందిన ఫొటో గ్యాలరీ, ప్రాజెక్టుల నమూనాలను మంత్రితో పాటు పోలీస్ ఉన్నతాధికారులు ఈ సందర్భంగా తిలకించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు పంచకర్ల రమేష్బాబు, అనకాపల్లి, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు తుహిన్ సిన్హా, అమిత్బర్దార్, కేవీ మహేశ్వరరెడ్డి, ఏఆర్ దామోదర్, ఎస్వి మాధవరెడ్డితో పాటు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.