Share News

బైక్‌ రేసింగ్‌లపై ఉక్కుపాదం

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:21 AM

వాహనాలకు మోడిఫైడ్‌ సెలెన్సర్లు, హైబీమ్‌లైట్లు అమర్చుకుని నగరంలో తిరుగుతున్న వాహనాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.

బైక్‌ రేసింగ్‌లపై ఉక్కుపాదం

142 మోడిఫైడ్‌ సైలెన్సర్లు, హైబీమ్‌లైట్లు ధ్వంసం

సీపీ శంఖబ్రత బాగ్చి

విశాఖపట్నం, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి):

వాహనాలకు మోడిఫైడ్‌ సెలెన్సర్లు, హైబీమ్‌లైట్లు అమర్చుకుని నగరంలో తిరుగుతున్న వాహనాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. 142 మోడిఫైడ్‌సైలెన్సర్లు, హైబీమ్‌లైట్లు, సెల్‌ఫోన్‌ స్టాండ్‌లను సీపీ శంఖబ్రతబాగ్చి ఆధ్వర్యంలో మంగళవారం రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు. కమిషనరేట్‌లోని ఏఆర్‌ కాంప్లెక్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి సీపీ హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ ద్విచక్రవాహనాలకు కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లను కాకుండా అధిక శబ్దం వెదజల్లే మోడిఫైడ్‌సైలెన్సర్లను అమర్చడం ఫ్యాషన్‌గా మారిందన్నారు. వాహనాల నుంచి వచ్చే అధికశబ్దాలతో హృద్రోగులు, వృద్ధులు, చిన్నారులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వాహనాలపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. ట్రాఫిక్‌ పోలీసులు గత ఐదునెలల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి 142 మోడిఫైడ్‌ సైలెన్సర్లు కలిగిన బైక్‌లను సీజ్‌ చేశారన్నారు. మోటార్‌వాహనాల చట్టం నిబంధనలకు విరుద్ధంగా కార్లకు అధికకాంతిని వెదజల్లే హైబీమ్‌లైట్లను అమర్చుతున్నారని, దీనివల్ల ఎదురుగా వచ్చే వాహనచోదకులు గందరగోళానికి గురై ప్రమాదాల బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో వందల సంఖ్యలో హైబీమ్‌లైట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కొంతమంది బైక్‌ హ్యాండిళ్లు, కారు డ్యాష్‌బోర్డులకు సెల్‌ఫోన్‌స్టాండ్‌లు అమర్చుకుని వాటిని చూస్తూ నడుపుతున్నారని, దీనివల్ల ఏకాగ్రత దెబ్బతిని ప్రమాదాలకు గురవుతున్నారన్నారు.

వేసవికిట్లు పంపిణీ

ఎండ నుంచి రక్షణ కల్పించే కిట్లను ట్రాఫిక్‌ పోలీసులకు సీపీ అందజేశారు. వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉన్నందున రౌండ్‌ టోపీతోపాటు కళ్లద్దాలు, ఓఆర్‌ఎస్‌ప్యాకెట్‌లు, ముఖానికి వేడిగాలుల నుంచి రక్షణ కోసం మాస్కులను కిట్‌లో ఉంచామన్నారు. 450 మందికి రూ.6.75లక్షలు విలువైన కిట్‌లను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఏడీసీపీ ప్రవీణ్‌కుమార్‌, ఏసీపీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2026 | 12:21 AM