ఆస్పత్రుల్లో కలెక్టర్ తనిఖీలు
ABN , Publish Date - Feb 11 , 2026 | 12:45 AM
రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించడమే ఆస్పత్రుల ప్రధాన లక్ష్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ పేర్కొన్నారు.
రోగులకు నాణ్యమైన సేవలు
అందించాల్సిందిగా వైద్యులకు ఆదేశం
విశాఖపట్నం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి):
రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించడమే ఆస్పత్రుల ప్రధాన లక్ష్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి, టీబీ అండ్ ఛాతీ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల లభ్యత, వైద్య సిబ్బంది హాజరు, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ఆధునిక వైద్య పరికరాల వినియోగం గురించి ఆరా తీశారు. రోగులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులతో మాట్లాడిన కలెక్టర్ వైద్య సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, నిరంతరం పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగేలా వైద్యులు, సిబ్బంది బాధ్యాతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్కుమార్, ప్రాంతీయ కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మీనాక్షిలు ఆస్పత్రిలో సౌకర్యాల గురించి వివరించారు.