జైళ్ల ఆధునికీకరణకు 950కోట్లు
ABN , Publish Date - Jan 29 , 2026 | 04:07 AM
దేశవ్యాప్తంగా జైళ్ల ఆధునికీకరణకు కేంద్రం రూ.950 కోట్లు కేటాయించింది. ఖైదీల సురక్ష, సంక్షేమం కోసం మరో రూ.161 కోట్లు కేటాయించాం’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు
ఖైదీల సంక్షేమం కోసం మరో 161 కోట్లు: కేంద్ర మంత్రి బండి సంజయ్
విశాఖలో ప్రారంభమైన జైళ్ల శాఖ 9వ జాతీయ సదస్సు
విశాఖపట్నం, జనవరి 28(ఆంధ్రజ్యోతి): ‘దేశవ్యాప్తంగా జైళ్ల ఆధునికీకరణకు కేంద్రం రూ.950 కోట్లు కేటాయించింది. ఖైదీల సురక్ష, సంక్షేమం కోసం మరో రూ.161 కోట్లు కేటాయించాం’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. జైళ్ల శాఖ 9వ జాతీయ సదస్సును బుధవారం విశాఖలో ఆయన ప్రారంభించారు. ‘వాస్తవంగా జైళ్లు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ నిర్వహణలో సహాయంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం నిధులు కేటాయించాలని నిర్ణయించింది. కొందరు ఖైదీలు కోర్టు విధించే జరిమానా చెల్లించలేకపోవడంతో జైళ్లలోనే మగ్గిపోవాల్సి వస్తోంది. అలాంటి వారికోసం ‘నిర్దన్ ఖైదీ సహాయత యోజన’ కింద ఏటా రూ.20 కోట్లు కేంద్రం కేటాయిస్తోంది. జైలు అంటే భయపడే పరిస్థితి కాకుండా, మార్పునకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించాలి. ఖైదీల్లో పరివర్తన తీసుకురావడంతో పాటు వారికి నైపుణ్య శిక్షణ అందేలా చూడాలి. దీనివల్ల శిక్షాకాలం తర్వాత ఖైదీలు బయటకు వచ్చి గౌరవంగా బతికే పరిస్థితి ఏర్పడుతుంది’ అని కేంద్ర మంత్రి అన్నారు. సదస్సుకు హాజరైన అధికారులతో మంత్రి సంజయ్ గ్రూపు ఫొటో దిగారు. తర్వాత వివిధ రాష్ట్రాల జైళ్లలో ఉన్న ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులతో కూడిన ఎగ్జిబిషన్ను ఆయన ప్రార ంభించారు. ఈ సదస్సులో ఏపీ జైళ్ల శాఖ డీజీపీ అంజనీకుమార్, బీపీఆర్ అండ్ డీ డైరెక్టర్ జనరల్ అలోక్రంజన్, ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖ డీజీపీ పీసీ మీనా, తెలంగాణ జైళ్లశాఖ డీజీపీ సౌమ్యమిశ్రా, ఏపీ జైళ్ల శాఖ ఐజీ డాక్టర్ ఇండ్ల శ్రీనివా్సతోపాటు పలు రాష్ట్రాల జైళ్ల శాఖ డీజీలు, ఐజీలు పాల్గొన్నారు.