Share News

డివైడర్‌పైకి దూసుకెళ్లిన కారు

ABN , Publish Date - May 10 , 2026 | 12:40 AM

ఎలమంచిలి మండలంలోని మర్రిబంద వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం పెద్ద ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి అన్నవరం వెళుతున్న కారు.. డివైడర్‌పై ఉన్న సోలారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలుకాగా, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

డివైడర్‌పైకి దూసుకెళ్లిన కారు
నుజ్జయిన కారు, ఊడిపోయిన ముందు యాక్సిల్‌

హెచ్చరిక బోర్డు, సోలారు విద్యుత్‌ స్తంభం ధ్వంసం

రోడ్డుపక్కన ఉన్న మహిళతోపాటు కారులో ఒకరికి తీవ్ర గాయాలు

విశాఖ నుంచి అన్నవరం వెళుతుండగా ప్రమాదం

ఎలమంచిలి, మే 9 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి మండలంలోని మర్రిబంద వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం పెద్ద ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి అన్నవరం వెళుతున్న కారు.. డివైడర్‌పై ఉన్న సోలారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలుకాగా, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

విశాఖ నగరంలోని అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన నూతన వధూవరులు, వారి కుటుంబ సభ్యులు ఏడుగురు కలిసి అర్టిగా కారులో శనివారం ఉదయం అన్నవరం సత్యనారాయణస్వామి దర్శనానికి బయలుదేరారు. దారిలో ఎలమంచిలి మండలం మర్రిబంద గ్రామం వద్దకు వచ్చే సరికి డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా కారు డివైడర్‌పైకి దూసుకుపోయి, హెచ్చరిక బోర్డును, సోలార్‌ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్నది. ఆ సమయంలో పొలం పనులకు వెళ్లేందుకు రోడ్డు పక్కన నిల్చుని వున్న మర్రిబంద గ్రామానికి చెందిన రుత్తల లక్ష్మిపై విద్యుత్‌ స్తంభం పడడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. కారులో ఉన్న ఒక మహిళ కూడా తీవ్రంగా గాయపడ్డారు. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు కారు ముందు యాక్సిల్‌ పూర్తిగా వుండిపోయింది. ఇంజన్‌ బాగా దెబ్బతిన్నది. క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా అనకాపల్లి వైపు నుంచి తుని వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సుమారు 30 నిమిషాల తరువాత పోలీసులు వచ్చి, ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్‌ ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపారు.

Updated Date - May 10 , 2026 | 12:40 AM