మండుతున్న ఎండలు
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:57 PM
జిల్లాలో వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. శనివారం ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపాడు. మధ్యాహ్నం వేడిగాలులు వీచాయి. ఆ సమయంలో రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి.
అత్యధికంగా దేవరాపల్లి మండలంలో 42.3 డిగ్రీలు
అనకాపల్లి, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): అత్యధికంగా దేవరాపల్లి మండలంలో 42.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, అత్యల్పంగా ఎలమంచిలిలో 35.4 డిగ్రీలు నమోదయ్యాయి. మాకవరపాలెం 41.2, నర్సీపట్నంలో 41,3, నాతవరంలో 40.9, రోలుగుంట లో 40.3, అనకాపల్లిలో 36.8, అచ్యుతాపురంలో 34.7, బుచ్చెయ్యపేటలో 38.9, చీడికాడలో 39.4, చోడవరంలో 39, మాడుగులలో 39.2, రావికమతంలో 39.3, గొలుగొండలో 39.6, కె.కోటపాడులో 38.9, కశింకోటలో 38.9, కోటవురట్లలో 37.5, మునగపాకలో 36.8, నక్కపల్లిలో 36.2, పరవాడలో 31.5, పాయకరావుపేటలో 35.5, రాంబిల్లి లో 34.3, ఎస్.రాయవరంలో 36.3, సబ్బవరంలో 37.4, ఎలమంచిలిలో 35.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చోడవరంలో..
చోడవరం: మండలంలో శనివారం ఉదయం నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో జనం అల్లాడిపోయారు. ఉదయం 11 గంటల కల్లా రోడ్లపై జనసంచారం తగ్గిపోయింది. సాయంత్రానికి వాతావరణం చల్లబడింది.
గొలుగొండలో..
గొలుగొండ: మండలంలోని ప్రధాన రహదారులు శనివారం మధ్యాహ్నం నిర్మానుష్యంగా మారాయి. ఉదయం నుంచే ఎండ అధికంగా ఉండడంతో జన సంచారం తగ్గింది. మండలంలోని గొలుగొండ, చీడిగుమ్మల, పాకలపాడు, గుండుపాల, కొత్తమల్లంపేట, అమ్మపేట, పప్పుశెట్టిపాలెం, కొత్తఎల్లవరం, కరక, కశిమి గ్రామాల్లో ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి సంకోచించారు.