అర్హులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:44 AM
జిల్లాలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందాలని అధికారులను కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. జిల్లాలో ప్రాథమిక రంగాల అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
- పారదర్శకంగా అందేలా అధికారులు బాధ్యత తీసుకోవాలి
- కలెక్టర్ టి.నిషాంతి ఆదేశం
- ప్రాథమిక రంగాల అభివృద్ధికి కృషి చేయాలని సూచన
పాడేరు, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందాలని అధికారులను కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. జిల్లాలో ప్రాథమిక రంగాల అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అర్హులైన రైతులకు వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు అందించాలన్నారు. ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారాలపైనా అధికారులతో ఆమె చర్చించారు. అలాగే ప్రభుత్వ పథకాల అమలులో సాంకేతిక, పరిపాలనాపరమైన ఇబ్బందులను పక్కాగా గుర్తించి, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖాధికారులు తక్షణ చర్యలు చే పట్టాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందేలా అధికారులు బాధ్యత వహించాలన్నారు. ప్రాథమిక రంగాలను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి, వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం ద్వారా వారు ప్రయోజనం పొందేందుకు అవకాశం కలుగుతుందన్నారు. రైతులకు సంబంధించిన పథకాల అమలుపై ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలను సేకరిస్తున్నదని, దానిపైనా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అందరికీ పథకాల ప్రయోజనాలను అందించడం ద్వారా సానుకూల స్పందన లభిస్తుందని, అందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఎస్బీఎస్ నందు, జిల్లా ఉద్యావనాధికారి కె.బాలకర్ణ, జిల్లా పట్టుపరిశ్రమాధికారి రాజేంద్రప్రసాద్బాబు, ఐటీడీఏ కాఫీ ఏడీ అయంత, జిల్లా పశు సంవర్థశాఖాధికారి కరుణాకర్, జిల్లా మత్స్యశాఖాధికారి శ్రీనివాసరావు, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎల్.భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్
జిల్లాలోని రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ టి.నిషాంతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సేవలను ప్రజలకు పారదర్శకంగా అందించాలని, అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు శ్రద్ధకనబరచాలన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 1,400 గ్రామాల్లో మూడు విడతలుగా భూముల రీసర్వే ప్రక్రియను చేపడుతున్నామని, దానికి పక్కాగా చేపట్టాలన్నారు. పీజీఆర్ఎస్లో రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీలను పరిశీలించి, పరిష్కరించాలన్నారు. రెవెన్యూ రికార్డుల భద్రత, డిజిటలైజేషన్, మ్యుటేషన్, అటవీ హక్కుల కల్పన, తదితర చర్యలు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు, జిల్లాలోని పదకొండు మండలాలకు చెందిన రెవెన్యూ, సర్వే విభాగం అధికారులు పాల్గొన్నారు.