గిరిజనులతో స్నేహంగా మెలగండి
ABN , Publish Date - Apr 03 , 2026 | 01:05 AM
‘గిరిజన ప్రాంతంలో పని చేయడం పనిష్మెంటు కాదు. అదృష్టంగా భావించి వారికి సేవలందించినప్పుడే మనం చేసే ఉద్యోగానికి సార్థకత లభిస్తుంది’ అని కలెక్టర్ దినేశ్కుమార్ అన్నారు. ఏపీఐఐసీ ఎండీగా బదిలీ అయిన సందర్భంగా కలెక్టరేట్లో గురువారం ఆయనకు వీడ్కోలు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో పారదర్శకత ప్రధానమని, గిరిజనులతో స్నేహ పూర్వకంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు.
వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలి
ఏజెన్సీలో ఉద్యోగం పనిష్మెంట్కాదు.. అదృషం
కలెక్టర్ దినేశ్కుమార్
బదిలీపై వెళుతుండడంతో ఘనంగా సత్కరించిన అధికారులు, ఉద్యోగులు
పాడేరు, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): ‘గిరిజన ప్రాంతంలో పని చేయడం పనిష్మెంటు కాదు. అదృష్టంగా భావించి వారికి సేవలందించినప్పుడే మనం చేసే ఉద్యోగానికి సార్థకత లభిస్తుంది’ అని కలెక్టర్ దినేశ్కుమార్ అన్నారు. ఏపీఐఐసీ ఎండీగా బదిలీ అయిన సందర్భంగా కలెక్టరేట్లో గురువారం ఆయనకు వీడ్కోలు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో పారదర్శకత ప్రధానమని, గిరిజనులతో స్నేహ పూర్వకంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో పర్యాటకంతోపాటు కాఫీ, మిరియాలు సాగు, గిరిజన రైతులతో సేంద్రీయ వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని అధికారులకు హితవు పలికారు. పట్టణాల్లో అన్ని సౌకర్యాలు వుంటాయని, కానీ ఎటువంటి సౌకర్యాలు లేని గిరిజన ప్రాంతాల్లో పని చేసి చక్కని సేవలు అందించాలన్నారు. సానుకూల దృక్పథంతో విధులు నిర్వహించాలని, గిరిజనులకు చక్కని సేవలు అందించాననే సంతృప్తి కలిగిందన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లా అభివృద్ధికి అధికారులు కష్టపడి పనిచేస్తున్నారని ప్రశంసించారు. అల్లూరి జిల్లా కలెక్టర్గా, రంపచోడవరం ఐటీడీఏ పీవోగా పని చేసిన కాలాన్ని ఎప్పటికీమరిచిపోనన్నారు. ఎస్పీ అమిత్బర్దార్, ఇన్చార్జి జేసీ, ఐటీడీఏ పీవో శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఇన్చార్జి డీఆర్వో నీలకంఠం, ఆర్డీవో ఎంవీఎస్.లోకేశ్వరరావు, తదిత రులు కలెక్టర్ దినేశ్కుమార్ సేవలను కొనియాడారు.
కలెక్టర్కు ఘనంగా వీడ్కోలు
కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్ వీడ్కోలు కార్యక్రమాన్ని అధికారులు, ఉద్యోగులు, తదితరులు గురువారం ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు సుమారు రెండు కిలోమీటర్లు మేర సాగిన ర్యాలీలో ఆయనపై పూలవర్షం కురిపించారు. ధింసా నృత్యాలు, మేళతాళాలతో ఊరేగించారు. అనంతరం కలెక్టరేట్లో ఆయనకు శాలువాలు కప్పి, జ్ఞాపికలు, పుష్పగుచ్ఛాలుఉ అందించి ఘనంగా సత్కరించారు. ఈ క్రమంలో ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, ఏవో హేమలత, డీఆర్డీఏ పీడీ వి.మురళీ, డీపీవో చంద్రశేఖర్, డీఎల్పీవో పీఎస్.కుమార్, వివిధ శాఖలకు చెందిన అఽధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.