బ్లూ జెట్ ఫార్మా భూమి పూజకు ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Feb 27 , 2026 | 11:54 PM
మండలంలోని లాలంకోడూరు పంచాయతీ సీతపాలెం సమీపంలో రూ.2,300 కోట్లతో ఏర్పాటు చేయనున్న బ్లూ జెట్ ఫార్మా కంపెనీ భూమి పూజ, శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
రాంబిల్లి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని లాలంకోడూరు పంచాయతీ సీతపాలెం సమీపంలో రూ.2,300 కోట్లతో ఏర్పాటు చేయనున్న బ్లూ జెట్ ఫార్మా కంపెనీ భూమి పూజ, శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం జరిగే ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేశ్ ముఖ్యఅతిథిగా హాజరుకానునుండడంతో అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు సీఐలు నరసింగరావు, చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లను అదనపు ఎస్పీ (అడ్మిన్) దేవప్రసాద్, పరవాడ డీఎస్పీ మోహనరావు పరిశీలించారు. వాహనాల పార్కింగ్, వీఐపీల రాకపోకల మార్గాలు, వేదిక భద్రత, తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖలు హాజరు కానున్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచించారు.