రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి మృతి
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:45 AM
అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలంలోని తుమ్మపాల వద్ద గురువారం అర్ధరాత్రి రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి మృతిచెందగా, ఆయన సోదరుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి ట్రాఫిక్ ఎస్ఐ శేషగిరిరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
తమ్ముడికి తీవ్రగాయాలు
అనకాపల్లి టౌన్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలంలోని తుమ్మపాల వద్ద గురువారం అర్ధరాత్రి రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి మృతిచెందగా, ఆయన సోదరుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి ట్రాఫిక్ ఎస్ఐ శేషగిరిరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
అనకాపల్లి మండలం బవులవాడకు చెందిన సంబకాయల అప్పల సూర్యప్రకాశరావు (48) హైదరాబాద్లోని ఆర్మీ ఆస్పత్రిలో ఏపీవోగా పనిచేస్తున్నారు. కుటుంబం విశాఖ నగరం సింహాచలం ప్రాంతంలోని సింహపురి కాలనీలో నివాసం ఉంటోంది. హైదరాబాద్ నుంచి సెలవుపై విశాఖపట్నం వచ్చిన ఆయన...గురువారం బవులవాడ గ్రామదేవత పండగకు హాజరయ్యేందుకు తన తమ్ముడు దుర్గారావుతో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. తుమ్మపాల సమీపాన వీరి వాహనాన్ని చోడవరం వైపు నుంచి అనకాపల్లి వస్తున్న మినీ బస్సు ఢీకొంది. దీంతో బైక్ వెనుక కూర్చున్న అప్పల సూర్యప్రకాశరావు ఎగిరి రోడ్డుపై పడడంతో తీవ్రగాయాలయ్యాయి. బైక్ నడుపుతున్న దుర్గారావు కూడా గాయపడ్డాడు. ఇద్దరినీ అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించారు. సూర్యప్రకాశరావు చికిత్స పొందుతూ మృతిచెందారు. దుర్గారావును కుటుంబ సభ్యులు పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. సూర్యప్రకాశరావు భార్య వెంకట భవానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. శుక్రవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.