అప్పలరాజును బేషరతుగా విడుదల చేయాలి
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:10 AM
అప్పలరాజును బేషరతుగా విడుదల చేయాలి
ఫొటో-(11ఎస్ఆర్వీఎం3)
పీడీ యాక్డును ఎత్తివేయాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్
ఎస్.రాయవరం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): పరిశ్రమల పేరుతో పేదల భూములను బలవంతంగా లాక్కోవడానికి ప్రత్నిస్తున్న ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న సీపీఎం నేత ఎం.అప్పలరాజును పీడీ యాక్టు కింద అరెస్టు చేయడం దారుణమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని అడ్డరోడ్డు జంక్షన్ సమీపంలో సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, అప్పలరాజుపై పీడీ యాక్టును ఉపసంహరించుకొని, ఆయనను జైలు నుంచి బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అంబానీ, అదాని వంటి బడాబాబులకు మోకరిల్లుతున్నదని ఆరోపించారు. అప్పలరాజును అరెస్టు చేసినప్పటి నుంచి ఆయనను కలిసేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబుకు ఒక చట్టం, అప్పలరాజుకు మరో చట్టం అమలవుతుందా అని ప్రశ్నించారు. జాతీయ రహదారి దిగ్బంధం, హోం మంత్రి కాన్వాయ్ అడ్డగింపు విషయంలో అప్పలరాజు ప్రమేయం, ప్రోద్బలం లేవన్నారు. ఇతనికి బెయిల్ కోసం తాము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడానికి నెల రోజుల సమయం కావాలని అడగడం విడ్డూరంగా వుందన్నారు. ఈ సభలో నాయకులు లోకనాథం, రాజాన దొరబాబు, కొణతాల హరినాథ్బాబు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.