Share News

కదంతొక్కిన అంగన్‌వాడీలు

ABN , Publish Date - Jul 10 , 2026 | 10:47 PM

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం అంగన్‌వాడీలు కదంతొక్కారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్ల చీరలు కట్టుకొని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానం నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

కదంతొక్కిన అంగన్‌వాడీలు
: కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్‌వాడీలు

వేతనాలు పెంచాలని నల్ల చీరలతో ఆందోళన

నవజీవన్‌ యాప్‌ రద్దు చేయాలని డిమాండ్‌

ప్రభుత్వ ఉద్యోగమంటూ పథకాలను రద్దు చేశారని మండిపాటు

కలెక్టరేట్‌ ముట్టడించిన అంగన్‌వాడీలు

పాడేరురూరల్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం అంగన్‌వాడీలు కదంతొక్కారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్ల చీరలు కట్టుకొని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానం నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ప్రధాన గేటు వద్ద బైటాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు డి.నాగమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వేతనం రూ.26 వేలు చేయాలని, సామాజిక భద్రత, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలకు పనివత్తిడి అధికంగా ఉందని, తక్షణమే నవజీవన్‌ యాప్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మినీ అంగన్‌వాడీలను మెయిన్‌ కేంద్రాలుగా మార్చాలని, బీఎల్‌వో పేరుతో ఎన్నికల డ్యూటీలను చేయిస్తున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగం పేరుతో సంక్షేమ పథకాలు వర్తించకుండా చేశారని మండిపడ్డారు. వెబ్‌సైట్‌లో ఉద్యోగం అనే పేరును తొలగించాలన్నారు. వంట గ్యాస్‌ సరఫరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాన్ని రూ.26 వేలు పెంచాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఈనెల 31వ తేదీన మరోసారి కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చిన్నారి, మోదకొండమ్మ, కొండమ్మ, వెంకటలక్ష్మి, జిల్లాలోని 11 ప్రాజెక్టుల నాయకులు, సీఐటీయూ నాయకులు ఎల్‌బీ.పోతురాజు, ఎల్‌.సుందరరావు, సత్యారావు, ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2026 | 10:47 PM