అడుగంటిన జలాశయాలు
ABN , Publish Date - Jun 12 , 2026 | 11:16 PM
ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరిందించే జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లో రోజురోజుకు నీటి నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి.
జోలాపుట్టు, డుడుమాల్లో తగ్గుతున్న నీటి నిల్వలు
చుక్కనీరు లేని జోలాపుట్టు స్పిల్వే డ్యామ్
ముంచంగిపుట్టు, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరిందించే జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లో రోజురోజుకు నీటి నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొద్దిరోజులుగా ఎండలు ఠారెత్తించడంతో జలాశయాల్లో జలకళ తప్పింది. జోలాపుట్టు జలాశయంలో 2,750 అడుగులు నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం ఉండగా.. శుక్రవారం 2718.30 అడుగులు నీటిమట్టం నమోదైంది. ఈ జలాశయానికి ఆనుకొని ఉన్న జోలాపుట్టు స్పిల్వే వద్ద పూర్తిస్థాయిలో అడుగంటిపోయింది. ఇటీవల మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా ప్రస్తుతం అక్కడ విద్యుత్ ఉత్పాదన జరగడం లేదు. దీంతో జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లో ఉన్న నీటిని ప్రస్తుతం నిల్వ ఉంచుతున్నారు. విద్యుత్ ఉత్పాదన పునరుద్ధరణరయ్యే నాటికి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్పుడు జలాశయాలు నిండుకుంటాయని ప్రాజెక్టు వర్గాలు చెబుతున్నాయి.