రేపటి నుంచి పాఠశాలల్లో ఆధార్ శిబిరాలు
ABN , Publish Date - Jan 04 , 2026 | 01:05 AM
జిల్లాలో ఐదు నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన విద్యార్థుల ఆధార్ వివరాలు అప్డేట్ చేసేందుకు ఈనెల ఐదో తేదీ నుంచి పాఠశాలల్లో క్యాంపులు నిర్వహించనున్నారు. పుట్టిన పిల్లలకు తల్లిదండ్రులు ఆధార్ తీసుకుంటారు. అయితే ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల వయస్సు వచ్చేసరికి పిల్లల వేలిముద్ర, ఐరిష్లో మార్పులు వస్తుంటాయి.
ఐదు నుంచి 15 ఏళ్ల మధ్య గల 80 వేల మంది వివరాల
అప్డేట్ కోసం నిర్వహణ
విశాఖపట్నం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఐదు నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన విద్యార్థుల ఆధార్ వివరాలు అప్డేట్ చేసేందుకు ఈనెల ఐదో తేదీ నుంచి పాఠశాలల్లో క్యాంపులు నిర్వహించనున్నారు. పుట్టిన పిల్లలకు తల్లిదండ్రులు ఆధార్ తీసుకుంటారు. అయితే ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల వయస్సు వచ్చేసరికి పిల్లల వేలిముద్ర, ఐరిష్లో మార్పులు వస్తుంటాయి. దీనివల్ల పాఠశాలల్లో బయోమెట్రిక్ సమయంలో ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల ఆధార్ వివరాలు అప్డేట్ చేసేందుకు జిల్లా గ్రామ, వార్డు సచివాలయ విభాగం పాఠశాలల వారీగా క్యాంపులు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది. ఈ క్యాంపులు గత ఏడాది సెప్టెంబరు నుంచి ఇప్పటివరకూ 20 వేల మంది పిల్లల ఆధార్ అప్డేట్ చేశారు. అధికారుల అంచనా మేరకు జిల్లాలో ఐదు నుంచి 15 ఏళ్ల వయస్సు మధ్య లక్ష మంది ఉంటారు. అంటే మరో 80 వేల మంది వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంది. వీరందరి కోసం పాఠశాలల వారీగా ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఆధార్ అప్డేషన్ చేసే ప్రక్రియ పూర్తిగా ఉచితమని జిల్లా గ్రామ/వార్డు సచివాలయ విభాగాధికారి పి.ఉషారాణి తెలిపారు. ఎక్కువమంది విద్యార్థులు పెండింగ్లో ఉన్న పాఠశాలలకు తొలుత ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.