బీసీ సంక్షేమ శాఖలో ఇష్టారాజ్యం
ABN , Publish Date - Apr 09 , 2026 | 01:30 AM
జిల్లా బీసీ సంక్షేమ శాఖలో ఒక అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అస్మదీయు లకు ప్రయోజనం చేకూర్చేందుకు అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. జిల్లాల విభజన జరిగి సుమారు నాలుగేళ్లు కావస్తోంది. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో యంత్రాంగం ఉంది. అయినప్పటికీ ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా సదరు అధికారి నియామకాలు, పదోన్నతులు చేపడుతూ ఆయా జిల్లాల్లోని ఉన్నతాధికారు లకు తెలియపరచకపోవడం గమనార్హం. ఈ విషయమై బీసీ సంక్షేమ శాఖలో పెద్దఎత్తున చర్చ జరుగోతంది. వివరాల్లోకి వెళితే...
ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన
అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్న అధికారి
పక్క జిల్లాలకు చెందిన అధికారులకు
పదోన్నతులు, వేతనాల పెంపు...
ఆ జిల్లాలకు చెందిన అధికారులకు సమాచారం లేకుండానే ప్రొసీడింగ్స్
ఉన్నతాధికారులకు ఫిర్యాదులు
విచారణ జరపాలనే డిమాండ్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జిల్లా బీసీ సంక్షేమ శాఖలో ఒక అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అస్మదీయు లకు ప్రయోజనం చేకూర్చేందుకు అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. జిల్లాల విభజన జరిగి సుమారు నాలుగేళ్లు కావస్తోంది. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో యంత్రాంగం ఉంది. అయినప్పటికీ ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా సదరు అధికారి నియామకాలు, పదోన్నతులు చేపడుతూ ఆయా జిల్లాల్లోని ఉన్నతాధికారు లకు తెలియపరచకపోవడం గమనార్హం. ఈ విషయమై బీసీ సంక్షేమ శాఖలో పెద్దఎత్తున చర్చ జరుగోతంది. వివరాల్లోకి వెళితే...
కొద్దిరోజుల కిందట విధి నిర్వహణలో ఉంటూ చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఇద్దరికి జూనియర్ అసిస్టెంట్లుగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. వారిలో ఒకరు అనకాపల్లి జిల్లా పరిఽధిలోకి వస్తారు. అయినప్పటికీ అక్కడి అధికారులకు కనీసం సమాచారాన్ని ఇవ్వలేదు. అలాగే, మరో నలుగురు క్లాస్-4 ఉద్యోగులకు వార్డెన్లుగా పదోన్నతి కల్పించారు. వారిలో ముగ్గురిని అనకాపల్లి జిల్లా పరిధిలోని హాస్టల్స్కు వార్డెన్లుగా నియమించారు. ఈ విషయమై అక్కడి అధికారులకు సమాచారం కూడా లేదు. ఈ ప్రక్రియలో కనీసం రోస్టర్ పాయింట్స్, ఇతర నిబంధనలను పాటించలేదన్న విమర్శలు ఉన్నాయి. అలాగే, అర్హత లేకపోయినా కొందరు ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు వేసి లబ్ధి చేకూర్చినట్టు విమర్శలు ఉన్నాయి. దీనిపై ఇప్పటికే కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదుల చేసినట్టు చెబుతున్నారు. ఇకపోతే, సదరు అధికారి జిల్లాల విభజనకు ముందు గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1కు పదోన్నతులు కల్పించినప్పుడు కూడా నిబంధనలు పాటించలేదన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని వసతి గృహాలకు ఇన్చార్జులను నియమించే విషయంలోనూ అదేవిధంగా వ్యవహరించారంటున్నారు. ఇతర శాఖలకు చెందిన వారికి బాధ్యతలను అప్పగించడంపై అప్పట్లోనే కొందరు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. ఇన్చార్జులను కూడా రెండు, మూడు నెలలకు మార్చేస్తుండడంపై కూడా పలువురు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు తీసుకున్న అనేక నిర్ణయాలకు సంబంధించి రూల్ పొజిషన్ కూడా పాటించలేదని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా పేరు చెప్పుకుని అందరినీ కార్యాలయానికి తెప్పించుకుని అడ్డగోలుగా వ్యహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో నెల్లూరులో పనిచేసినప్పుడు కూడా ఈ తరహాలోనే చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటివరకు సదరు అధికారి తీసుకున్న నిర్ణయాలపై ఉన్నతాధికారులు దృష్టిసారించి విచారణ చేయాలని కోరుతున్నారు.