మన్యంలో ముసురు
ABN , Publish Date - Jul 17 , 2026 | 11:30 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మన్యంలో శుక్రవారం ముసురు వాతావరణం నెలకొంది. అడపా దడపా జల్లులు కురుస్తున్నాయి.
అడపాదడపా జల్లులు
అయినా తగ్గని వేడి
పాడేరు, జూలై 17 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మన్యంలో శుక్రవారం ముసురు వాతావరణం నెలకొంది. అడపా దడపా జల్లులు కురుస్తున్నాయి. జిల్లాలో ఎండలేనప్పటికీ వేడి ప్రభావం ఉంది. వారం రోజుల క్రితం వరకు వర్షాలు కురిసినప్పటికీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టలేదు. దీంతో ఏజెన్సీ వాసులు సైతం ఉక్కపోతకు గురవుతున్నారు. ఏజెన్సీలో శుక్రవారం కొయ్యూరులో 32 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా జీకేవీధిలో 28.4, అనంతగిరిలో 27.2, అరకులోయలో 26.8, పాడేరులో 26.5, హుకుంపేటలో 26.1, చింతపల్లిలో 25.8, డుంబ్రిగుడలో 25.7, జి.మాడుగులలో 25.2, పెదబయలులో 24.6, ముంచంగిపుట్టులో 24.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సీలేరులో..
జీకేవీధి మండలం సీలేరు, ధారకొండల్లో శుక్రవారం సాయంత్రం ఒక మోస్తరు వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. వారం రోజులుగా సీలేరులో వాతావరణం మబ్బులు కమ్ముకుని ఉన్నప్పటికీ ఎల్లినో ప్రభావంతో తీవ్ర ఉక్కపోత, వేడి వాతావరణం నెలకొని ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. శుక్రవారం సాయంత్రం ఒక మోస్తరు వర్షం కురవడంతో వాతావరణం చల్లబడి ప్రజలు సేదదీరారు.