మూన్నాళ్ల ముచ్చట!
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:43 AM
వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ ఆధ ్వర్యంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పన కోసం చేపట్టిన కుట్టు శిక్షణ కార్యక్రమం మూన్నాళ్ల ముచ్చటగా మారింది. సుమారు ఏడాది నుంచి శిక్షణ కార్యక్రమాలు నిలిచిపోవడంతో కుట్టు మిషన్లు దుమ్ము, తుప్పుపట్టి పాడైపోతున్నాయి.
చోడవరంలో ఏడాదిగా మూతపడి ఉన్న కుట్టు శిక్షణ కేంద్రం
పట్టించుకోని బీసీ కార్పొరేషన్ అధికారులు
దుమ్ము, తుప్పుపట్టి పాడైపోతున్న కుట్టు మిషన్లు
చోడవరం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ ఆధ ్వర్యంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పన కోసం చేపట్టిన కుట్టు శిక్షణ కార్యక్రమం మూన్నాళ్ల ముచ్చటగా మారింది. సుమారు ఏడాది నుంచి శిక్షణ కార్యక్రమాలు నిలిచిపోవడంతో కుట్టు మిషన్లు దుమ్ము, తుప్పుపట్టి పాడైపోతున్నాయి.
గ్రామీణ మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించి, అనంతరం వారు స్వయం ఉపాధి పొందేందుకు కుట్టు మిషన్లు మంజూరు చేసేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా గత ఏడాది మే నెలలో కుట్టు శిక్షణ కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం చోడవరం మండలంలో పలువురు ఔత్సాహిక మహిళలను ఎంపిక చేశారు. స్థానిక దుడ్డువీధిలోని ఒక కల్యాణ మండపంలో ఉచితంగా కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీరికి సుమారు నెల రోజులపాటు శిక్షణ ఇచ్చారు. తరువాత బ్యాచ్ల వారీగా మహిళలకు కుట్టు శిక్షణ ఉంటుందని అధికారులు ప్రకటించారు. కానీ మొదటి బ్యాచ్కు శిక్షణ పూర్తయిన వెంటనే ఈ కేంద్రాన్ని మూసేశారు. కుట్టు మిషన్లు దుమ్ము, తుప్పు పట్టి నిరుపయోగంగా మారుతున్నాయి. శిక్షణ పొందిన మహిళలకు ఇంతవరకు కుట్టు మిషన్లు అందజేయలేదు.