మెరిసిన మినీ ఇండియా
ABN , Publish Date - May 30 , 2026 | 11:39 PM
అరకులోయలో మినీ ఇండియా మెరిసింది. ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు అరకులోయలో నిర్వహించిన జాతీయ ట్రెక్కింగ్ యాత్ర ఏపీ-ట్రెక్ 11 శనివారం ముగిసింది.
ముగిసిన ఏపీ ట్రెక్-11
కఠినమైన కొండల్లో ట్రెక్కింగ్
ఐక్యత, క్రమశిక్షణను చాటిన ఎన్సీసీ క్యాడెట్లు
అరకులోయ, మే 30 (ఆంద్రజ్యోతి): అరకులోయలో మినీ ఇండియా మెరిసింది. ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు అరకులోయలో నిర్వహించిన జాతీయ ట్రెక్కింగ్ యాత్ర ఏపీ-ట్రెక్ 11 శనివారం ముగిసింది. ఏఎస్ఆర్ పబ్లిక్ స్కూల్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో 600 మంది ఎన్సీసీ క్యాడెట్లు సందడి చేశారు. ఈ యాత్రలో దేశం నలుమూలల నుంచి వచ్చిన యువ ట్రెక్కర్ల ధైర్యసాహసాలు, పట్టుదల, సహకారం, స్నేహబంధాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా క్యాంప్ కమాండంట్ లెప్టినెంట్ కల్నల్ నీరజ్కుమార్ మాట్లాడుతూ కఠినమైన కొండ మార్గాల్లో ట్రెక్కింగ్ చేసిన క్యాడెట్లను అభినందించారు. ఏపీ ట్రెక్-11 పూర్తి చేయడం కేవలం శారీరక సహన శక్తికి నిదర్శనమన్నారు. రాష్ట్రాల మధ్య, భాషల మధ్య భేదాలు లేకుండా పరస్పరం సహకరించుకుంటూ యాత్ర చేయడమే ఏపీ ట్రెక్-11 ముఖ్యోద్దేశమన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో యాత్రలో విశిష్ట నాయకత్వం, జట్టు భావన ప్రదర్శించిన బృందాలు, వ్యక్తులను క్యాంప్ కమాండెంట్, సీనియర్ అధికారులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుబేదార్ మేజర్ రాజేంద్రన్, ప్రభుత్వ మహిళా కశాశాల ప్రిన్సిపాల్ చలపతిరావు, అల్లూరి సీతారామరాజు పబ్లిక్ స్కూల్ సిబ్బంది, ఎన్సీసీ శిక్షణ అధికారులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్యాడెట్లు పాల్గొన్నారు.