త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:16 AM
మండలంలోని గోకులపాడు సమీపంలో జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు డివైడర్ను ఢీకొని, అవతల వైపునకు దూసుకుపోయింది. ఇదే సమయంలో అటుగా వస్తున్న లారీని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ పాదం తెగిపోయింది. బస్సుల్లోని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి.
గోకులపాడు వద్ద అదుపు తప్పిన ట్రావెల్స్ బస్సు
డివైడర్ మీద నుంచి అవతల మార్గంలోకి దూసుకెళ్లి లారీని ఢీకొన్న వైనం
బస్సు డ్రైవర్కు తీవ్రగాయాలు
సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు
ఎస్.రాయవరం, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గోకులపాడు సమీపంలో జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు డివైడర్ను ఢీకొని, అవతల వైపునకు దూసుకుపోయింది. ఇదే సమయంలో అటుగా వస్తున్న లారీని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ పాదం తెగిపోయింది. బస్సుల్లోని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి.
కేరళం రాష్ట్రం నుంచి 49 మంది కూలీలతో ప్రైవేటు ట్రావెల్ బస్సు ఒడిశాలోని కోరాపుట్కు వెళుతున్నది. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత మండలంలోని గోకులపాడు సమీపంలోకి వచ్చేసరికి అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్నది. అంతటితో ఆగకుండా అవతల వైపు రోడ్డులోకి దూసుకెళ్లింది. ఇదే సమయంలో ఒడిశా నుంచి పెద్దాపురానికి ధాన్యం లోడుతో వెళుతున్న లారీని ఎడమవైపున ఢీకొన్నది. దీంతో బస్సు కుడివైపున డ్రైవర్ క్యాబిన్ నుజ్జునుజ్జు అయ్యింది. కేరళం రాష్ట్రానికి చెందిన బస్సు డ్రైవర్ రషీద్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. అతని కుడి కాలు పాదం పూర్తిగా తెగిపోయింది. మరో కాలుకు తీవ్రగాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న కూలీలు క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం గురించి తెలుసున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు, నైట్ బీట్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి బస్సు క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను బయటకు తీసి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్కు పంపారు.
కాగా ప్రమాదం జరిగిన సమయంలో ధాన్యం లారీకి వెనుక వస్తున్న మరో లారీ డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సు తన లారీని ఢీకొనకుండా వుండేందుకు కుడివైపునకు మళ్లించాడు. దీంతో డివైడర్ను ఢీకొని లారీ ఆగిపోయింది. లేకపోతే బస్సులోని కార్మికులకు పెద్ద ప్రమాదం వాటిల్లేదని పోలీసులు అభిప్రాయపడ్డారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై తుని వైపు వెళ్లే మార్గంలో సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. హైవే పెట్రోలింగ్ పోలీసులు క్రేన్ను రప్పించి, రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయిన బస్సు, రెండు లారీలను పక్కకు తీయించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసినట్టు ఎస్.రాయవరం పోలీసులు తెలిపారు.