మన్యంపై మంచు దుప్పటి
ABN , Publish Date - Jan 03 , 2026 | 10:45 PM
మన్యంలో శనివారం ఉదయం పొగమంచు కమ్మేసింది. శీతాకాల వాతావరణం నెలకొనడంతో పొగమంచు దట్టంగానే కురిసింది.
స్వల్పంగా పెరిగిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు
అయినా తగ్గని చలి
పాడేరు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): మన్యంలో శనివారం ఉదయం పొగమంచు కమ్మేసింది. శీతాకాల వాతావరణం నెలకొనడంతో పొగమంచు దట్టంగానే కురిసింది. జిల్లా కేంద్రం పాడేరులో తెల్లవారుజాము నుంచి ఎనిమిది గంటల వరకు ఎదుట వ్యక్తులు కన్పించని విధంగా మంచు కురిసింది. తాజా వాతావరణం పర్యాటకులు కనువిందు చేసేలా ఆహ్లాదకరంగా ఉంది. వాస్తవానికి మూడు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నప్పటికీ చలి తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ప్రజలు ఉన్ని దుస్తులు ధరిస్తూ చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు.
ముంచంగిపుట్టులో 8.1 డిగ్రీలు
వాతావరణంలోని మార్పులతో మన్యంలోని కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్పల్పంగా పెరుగుతున్నాయి. శనివారం ముంచంగిపుట్టులో 8.1 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదుకాగా జి.మాడుగులలో 8.7, అరకులోయలో 9.4, హుకుంపేట, పెదబయలులో 10.9, పాడేరులో 11.7, చింతపల్లిలో 13.1, కొయ్యూరులో 14.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.