Share News

సామాజిక పింఛన్లు 91.39 శాతం పంపిణీ

ABN , Publish Date - May 02 , 2026 | 01:00 AM

జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ శుక్రవారం 91.39 శాతం పూర్తయ్యింది.

సామాజిక పింఛన్లు 91.39 శాతం పంపిణీ

విశాఖపట్నం, మే 1 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ శుక్రవారం 91.39 శాతం పూర్తయ్యింది. సాయంత్రానికి జిల్లాలో 1,57,914 మందికిగాను 1,44,324 మందికి (91.39 శాతం) పింఛన్లు పంపిణీ చేశారు. మొత్తం రూ.69.46 కోట్లకుగాను రూ.63.21 కోట్లు పింఛన్‌దారులకు అందజేశారు. నాలుగు గ్రామీణ మండలాల్లో 26,228 మందికి గాను 24,211 మందికి రూ.10.2 కోట్లు, జీవీఎంసీ పరిధిలో 1,31,686 మందికి గాను 1,20,113 మందికి రూ.53 కోట్లు పంపిణీ చేశారు. కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ పెదజాలారిపేటలో పింఛన్లు పంపిణీ చేశారు.


తిరుమల ఎక్స్‌ప్రెస్‌

గుంతకల్‌ వరకు పొడిగింపు

ఈనెల 12 నుంచి అమలు

విశాఖపట్నం, మే 1 (ఆంధ్రజ్యోతి):

విశాఖ-కడప, కడప-విశాఖ మధ్య రాకపోకలు సాగిస్తున్న తిరుమల ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను (18522/18521) ఈనెల 12 నుంచి గుంతకల్‌ వరకు పొడిగిస్తున్నామని వాల్తేరు రైల్వే డివిజన్‌ సీనియర్‌ డీసీఎం కె.పవన్‌కుమార్‌ తెలిపారు. ఈనెల 12 నుంచి గుంతకల్‌-విశాఖ తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (18522) మధ్యాహ్నం 1.30 గంటలకు గుంతకల్‌లో బయలుదేరి రాత్రి 8.20 గంటలకు తిరుపతి చేరుతుంది. అక్కడ నుంచి 8.30 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 11.30 గంటలకు విశాఖ చేరుతుంది.

విశాఖ-గుంతకల్‌ తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (18521) ఈనెల 13 నుంచి మధ్యాహ్నం 2.00 గంటలకు విశాఖలో నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 4.10 గంటలకు తిరుపతి చేరుతుంది. అక్కడ నుంచి 4.25 గంటలకు బయలుదేరి 11.30 గంటలకు గుంతకల్‌ చేరుతుంది.


ఆగని మాంసం విక్రయాలు!

జీవీఎంసీ ఆదేశాలు బేఖాతరు

మురళీనగర్‌/అక్కయ్యపాలెం, మే 1 (ఆంధ్రజ్యోతి):

బుద్ధ జయంతి సందర్భంగా శుక్రవారం మాంసం, చేపల విక్రయాలు చేపట్టరాదని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, ప్రధాన వైద్యాధికారి ఓ.నరేష్‌కుమార్‌ గురువారం ప్రకటన విడుదల చేసినా దుకాణదారులు పట్టించుకోలేదు. ఉత్తర నియోజకవర్గంలో చికెన్‌, మటన్‌, చేపల విక్రయాలు యథావిధిగా కొనసాగాయి. ఆంక్షల అమలును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన ఏఎంహెచ్‌ఓలు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్‌లు చూసీచూడనట్టు వదిలేశారు. దీంతో మురళీనగర్‌, ఎన్‌జీజీవోస్‌ కాలనీ, మాధవధార, మర్రిపాలెం, ఊర్వశి జంక్షన్‌, బర్మాక్యాంప్‌ తదితర ప్రాంతాల్లో రోడ్ల వెంబడి రోజంతా దుకాణాలు తెరిచే కనిపించాయి. అలాగే అక్కయ్యపాలెం, నరసింహనగర్‌ ప్రాంతాల్లో కూడా కొన్ని దుకాణాలు చికెన్‌, మటన్‌ విక్రయాలు సాగించాయి.


అటవీ శాఖ సీసీఎఫ్‌గా ఐకేవీ రాజు

విశాఖపట్నం, మే 1 (ఆంధ్రజ్యోతి):

అటవీ శాఖ విశాఖ సర్కిల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (సీసీఎఫ్‌)గా గుంటూరు సీసీఎఫ్‌ ఐకేవీ రాజు నియమితులయ్యారు. ఇక్కడ సీసీఎఫ్‌గా పనిచేస్తున్న మహ్మద్‌ దివాన్‌ మైదీన్‌ను రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీపీఎస్‌సీ 1993 నిర్వహించిన పరీక్ష ద్వారా అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌గా ఎంపికైన రాజు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. విశాఖ అటవీ శాఖ సర్కిల్‌లో గల విశాఖపట్నం, నర్సీపట్నం, పాడేరు, విజయనగరం, శ్రీకాకుళంలో డీఎఫ్‌వోగా పనిచేశారు. ఈ ప్రాంతంపై ఆయనకు పట్టు ఉంది. రెండు, మూడు రోజుల్లో ఆయన సీసీఎఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా విశాఖలోని ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ ప్రాంతీయ మేనేజరుగా పనిచేస్తున్న టి.జ్యోతిని రాజమండ్రి సీసీఎఫ్‌గా బదిలీ చేసిన ప్రభుత్వం, ఆమె స్థానంలో కర్నూలులో కన్జర్వేటర్‌గా ఉన్న బీవీఏ కృష్ణమూర్తినాయుడిని నియమించింది.


రేపే నీట్‌

ఉమ్మడి జిల్లాలో 8,000 మంది విద్యార్థులు...18 కేంద్రాలు

సిరిపురం, మే 1 (ఆంధ్రజ్యోతి):

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం ఆదివారం నిర్వహిస్తున్న నీట్‌-2026కు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ పరీక్షకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి సుమారు ఎనిమిది వేల మంది హాజరవుతున్నారు. వీరి కోసం నగరంలో 18 కేంద్రాలు ఏర్పాటుచేశారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు జరగనుంది. విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల తరువాత అనుమతించరు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకోవాలని అధికారులు సూచించారు.


విశాఖలో ఎన్‌ ఐఏ స్టేషన్‌

విశాఖపట్నం, మే 1 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నంలో నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. దీనికోసం గతంలో రాష్ట్ర డీజీపీ విజ్ఞప్తి చేయగా ఢిల్లీలో ఎన్‌ఐఏ ఐజీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్‌ఐఏకి సంబంధించిన కేసులన్నీ విశాఖపట్నం బ్రాంచి కిందికే వస్తాయని ఉత్తర్వులో పేర్కొన్నారు.

Updated Date - May 02 , 2026 | 01:01 AM