సివిల్స్ ఉచిత శిక్షణ రాత పరీక్షకు 727 మంది హాజరు
ABN , Publish Date - Jul 19 , 2026 | 11:40 PM
పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో సివిల్స్ ఉచిత శిక్షణకు గిరిజన నిరుద్యోగ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పాడేరులోని ఆరు పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన రాత పరీక్షకు 727 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
పాడేరులో ఆరు కేంద్రాల్లో నిర్వహణ
పాడేరు రూరల్, జూలై 19(ఆంధ్రజ్యోతి): పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో సివిల్స్ ఉచిత శిక్షణకు గిరిజన నిరుద్యోగ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పాడేరులోని ఆరు పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన రాత పరీక్షకు 727 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు 1,380 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 727 మంది హాజరయ్యారు. 653 మంది గైర్హాజరయ్యారు. అభ్యర్థుల ఎంపికకు పరీక్షను నిర్వహించేందుకు తలారిసింగి జీటీడబ్ల్యూఏ బాలుర పాఠశాల, శ్రీకృష్ణాపురం జీటీడబ్ల్యూఏ బాలికల పాఠశాల, లోచలిపుట్టు జీటీడబ్ల్యూఏ బాలుర పాఠశాల, ఏపీటీడబ్ల్యూఆర్ బాలికల స్కూల్, ఏపీటీడబ్ల్యూఆర్ బాలికల జూనియర్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. తలారిసింగి సెంటర్లో 288 మంది హాజరుకావాల్సి ఉండగా, 151 మంది హాజరయ్యారు. శ్రీకృష్ణాపురం సెంటర్లో 192 మందికి 103 మంది, లోచలిపుట్టు సెంటర్లో 145 మందికి 71, ఏపీఆర్ బాలికల పాఠశాల సెంటర్లో 264 మందికి 94, ఏపీఆర్ బాలికల జూనియర్ కళాశాల సెంటర్లో 231 మందికి 71, ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో 260 మందికి గాను 237 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను ఐటీడీఏ ఏపీవో (పీవీటీజీ) ఎం.వెంకటేశ్వరరావు, తదితరులు పర్యవేక్షించారు. రాత పరీక్షలో ప్రతిభ చూపిన 100 మంది అభ్యర్థులను గుర్తించి వారికి 11 నెలల పాటు ఉచిత భోజన వసతి సౌకర్యం కల్పిస్తూ విశాఖ వేపగుంటలోని గిరిజన సంక్షేమ శాఖ యూత్ ట్రైనింగ్ సెంటర్లో సివిల్స్ ఉచిత శిక్షణ అందిస్తారు.