400 కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Jul 16 , 2026 | 11:29 PM
మండలంలోని లబ్బూరు జంక్షన్ సమీపంలో గురువారం సాయంత్రం స్థానిక పోలీసులు 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేశారు.
ఇద్దరి అరెస్టు
ముంచంగిపుట్టు, జూలై 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని లబ్బూరు జంక్షన్ సమీపంలో గురువారం సాయంత్రం స్థానిక పోలీసులు 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించి జి.మాడుగుల సీఐ ఎస్.లక్ష్మణరావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. ఎస్పీ అమిత్బర్ధార్ ఆదేశాల మేరకు లబ్బూరు సమీపంలో స్థానిక ఎస్ఐ పి.నాని ఆధ్వర్యంలో సిబ్బంది గురువారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో ఒడిశా వైపు నుంచి వస్తున్న వ్యాన్ను ఆపి తనిఖీ చేయగా 12 ప్లాస్టిక్ బస్తాల్లో 400 కిలోల గంజాయి ఉన్నట్టు గుర్తించారు. వ్యాన్లో ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారు ఒడిశా రాష్ట్రానికి చెందిన అభిజిత్, గణశ్యామ్గా గుర్తించారు. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ నుంచి కొరాపుట్టు జిల్లా జైపూర్కు ఆంధ్రా మీదుగా వీరు గంజాయి తరలించడానికి ప్రయత్నించినట్టు విచారణలో తేలింది. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్టు సీఐ తెలిపారు.