జిల్లాకు 389 విద్యా బోధకుల పోస్టులు మంజూరు
ABN , Publish Date - Aug 14 , 2026 | 11:16 PM
అల్లూరి జిల్లాలోని 11 మండలాల్లో తాత్కాలిక విద్యా బోధకులుగా విధులు నిర్వహించేందుకు ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 19వ తేదీలోగా ఆయా ఎంఈవోలకు దరఖాస్తులు అందజేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.భానుమూర్తి రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వీటిలో 385 ఎస్జీటీలు, 4 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు
8 నెలలు మాత్రమే ఉద్యోగం
19వ తేదీ లోగా ఎంఈవోలకు దరఖాస్తులు సమర్పించాలి
పాడేరురూరల్, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లాలోని 11 మండలాల్లో తాత్కాలిక విద్యా బోధకులుగా విధులు నిర్వహించేందుకు ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 19వ తేదీలోగా ఆయా ఎంఈవోలకు దరఖాస్తులు అందజేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.భానుమూర్తి రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు 389 మంది విద్యా బోధకుల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అందులో 385 సెకెండరీ టీచర్ పోస్టులు, 4 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయన్నారు. ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికంగా నియమించబడతాయన్నారు. అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల సేవలు ఈ ఏడాది సెప్టెంబరు 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ తేదీ వరకు(8 నెలలు)కొనసాగుతాయన్నారు. ఈ పోస్టులు అనంతగిరి మండలంలో 21 ఎస్జీటీ, అరకులోయలో 4 ఎస్జీటీ, 1 స్కూల్ అసిస్టెంట్ (బీఎస్), చింతపల్లిలో 37 ఎస్జీటీ, డుంబ్రిగూడలో 38 ఎస్జీటీ, జీకేవీధిలో 72 ఎస్జీటీ, జి.మాడుగులలో 52 ఎస్జీటీ, హుకుంపేటలో 22 ఎస్జీటీ, 1 ఎస్ఏ(హిందీ), 1 ఎస్ఏ(మేథ్స్), కొయ్యూరులో 30 ఎస్జీటీ, ముంచంగిపుట్టులో 54 ఎస్జీటీ, పాడేరులో 6 ఎస్జీటీ, 1 ఎస్ఏ(హిందీ), పెదబయలు మండలంలో 49 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయన్నారు. ఆ సక్తి, అర్హత గల అభ్యర్థులు ఆయా మండలాల ఎంఈవోలకు ఈనెల 19వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని ఆయన తెలిపారు.