అరకులో 3.65 కిలోల లిక్విడ్ గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Jul 22 , 2026 | 10:33 PM
విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు బుధవారం అరకులోయలోని ఒక ఇంట్లో సోదాలు చేసి 3.65 కిలోల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్టు చేశారు.
ఒకరి అరెస్టు
నిందితుడి స్వస్థలం రాజమహేంద్రవరంలో కూడా
ఎన్సీబీ సోదాలు...1.5 కిలోలు గుర్తింపు
విలువ సుమారు కోటి రూపాయలు
అరకులోయ, జూలై 22 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు బుధవారం అరకులోయలోని ఒక ఇంట్లో సోదాలు చేసి 3.65 కిలోల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అరకులోయ పోలీస్ స్టేషన్లో విలేకరులతో ఎన్సీబీ సీఐ కిరణ్బాబు మాట్లాడుతూ రాజమహేంద్రవరానికి చెందిన బెల్లపు కృష్ణమూర్తి అరకులోయలో నివాసం ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్నాడన్నారు. అతనిపై గతంలో పలు కేసులు ఉన్నాయని, పక్కా సమాచారం రావడంతో నిఘా పెట్టామన్నారు. బుధవారం కృష్ణమూర్తి ఉంటున్న ఇంటిపై దాడి చేసి 3.65 కిలోల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అతడి స్వస్థలమైన రాజమహేంద్రవరంలోని ఇంట్లో కూడా లిక్విడ్ గంజాయి ఉన్నట్టు విచారణలో తేలడంతో అక్కడి అధికారులు సోదాలు చేసి 1.5 కిలోలు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. రెండుచోట్ల పట్టుకున్న 5.15 కిలోల లిక్విడ్ గంజాయి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని తెలిపారు.