టెన్త్ పరీక్షలు ప్రారంభం
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:58 AM
జిల్లాలోని 133 కేంద్రాల్లో సోమవారం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
తొలిరోజు 99.7 శాతం మంది హాజరు
కేంద్రాల వద్ద కోలాహలం
విశాఖపట్నం, మార్చి 16 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని 133 కేంద్రాల్లో సోమవారం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ప్రథమ భాష (తెలుగు/సంస్కృతం/హిందీ/ఉర్దూ/ఒరియా) పరీక్షకు 29,042 మందికిగాను 28,995 మంది (99.7 శాతం) హాజరయ్యారు. విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు రావడంతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. లాసన్స్బే కాలనీలోని ఓంకార్ లయన్స్ బధిర పాఠశాల విద్యార్థులు చినవాల్తేర్లోని కేడీపీఎం ఉన్నత పాఠశాలలో, ఎండాడ అంధ బాలికల పాఠశాల విద్యార్థినులు చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో పరీక్షలు రాశారు. ప్రతి కేంద్రంలో ఆశ కార్యకర్త/ఏఎన్ఎంను అందుబాటులో ఉంచారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇదిలావుండగా పరీక్షల నిర్వహణకుగాను జిల్లా పరిశీలకుడిగా వచ్చిన దేవానందరెడ్డి ఐదు, ఆర్జేడీ విజయభాస్కర్ నాలుగు, డీఈవో ఎన్.ప్రేమకుమార్ ఎనిమిది కేంద్రాలను తనిఖీ చేశారు. మరోవైపు ఫ్లైయింగ్ స్వ్కాడ్ 46 కేంద్రాలను తనిఖీ చేసింది. తొలిరోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని డీఈవో ప్రేమకుమార్ తెలిపారు. ఇదిలావుండగా ఏపీ సార్వత్రిక పీఠం ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో 11 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 578 మంది విద్యార్థులకుగాను 480 మంది (83.04 శాతం) హాజరయ్యారు.