కారు ఢీకొని యువకుడి మృతి
ABN , Publish Date - May 22 , 2026 | 12:04 AM
మునిసిపాలిటీ పరిధిలోని బొడ్డేపల్లిపేట జంక్షన్ వద్ద బుధవారం రాత్రి కారు ఢీకొని కల్లేపల్లి పాపారావు (25) మృతి చెందినట్లు ఎస్ఐ సనపల బాలరాజు తెలిపారు.
ఆమదాలవలస, మే 21(ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీ పరిధిలోని బొడ్డేపల్లిపేట జంక్షన్ వద్ద బుధవారం రాత్రి కారు ఢీకొని కల్లేపల్లి పాపారావు (25) మృతి చెందినట్లు ఎస్ఐ సనపల బాలరాజు తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. బూర్జ మండలంలోని టీడీఆర్రాజుపేట (అయ్యవారిపేట) గ్రామానికి చెందిన పాపారావు శ్రీకాకుళం నుంచి పాలకొండ వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. బొడ్డేపల్లి జంక్షన్ వద్ద ఎదురుగా పాలకొండ వైపు నుంచి ఆమదాలవలస వైపు వస్తున్న కారు ఢీకొనడంతో పాపారావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పాపారావు తండ్రి కల్లేపల్లి రాజారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబానికి అండగా నిలుస్తాడనుకున్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో...తమకు దిక్కెవరని పాపారావు తల్లిదండ్రులు దీనంగా విలపిస్తున్నారు.
అయ్యవారిపేటలో విషాదం..
బూర్జ, మే 21(ఆంధ్రజ్యోతి): బూర్జ మండలంలోని అయ్యవారిపేట గ్రామానికి చెందిన కె.పాపారావు బొడ్డేపల్లిపేట వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో గ్రామంలో విషాదం అలముకుంది. పాపారావు మృతిపై జనసేన మండలాధ్యక్షుడు కె.నాగేంద్ర, జనసేన ఇన్చార్జి రామ్మోహన్నాయుడు, కొల్లివలస ఎంపీటీసీ విక్రం, కె.మల్లేశ్వరరావు, మార్క్ఫెడ్ డైరెక్టర్ రామకృష్ణనాయుడు తదితరులు సంతాపం తెలిపారు.