అమ్మో.. కాశీబుగ్గ బస్టాండ్
ABN , Publish Date - Jul 04 , 2026 | 11:22 PM
కాశీబుగ్గ బస్టాండ్ నుంచి ప్రతిరోజూ 5 నుంచి 10 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అటు వంటి బస్టాండ్ ప్రమాదకరంగా మారింది.
- శిథిలావస్థకు చేరుకున్న భవనం
- పెచ్చులూడిపడుతున్న వైనం
- ప్రయాణికుల్లో భయం
కాశీబుగ్గ, జూలై 4 (ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ బస్టాండ్ నుంచి ప్రతిరోజూ 5 నుంచి 10 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అటు వంటి బస్టాండ్ ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు కూలిపోతుందో తెలియని రీతిలో ఉంది. ప్రస్తుతం బస్టాండ్ శ్లాబు పెచ్చులూడి పడుతోంది. మెట్లు ధ్వంసమయ్యాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయం ప్రయాణికులను వెంటాడుతోంది.
12 మండలాల ప్రజల రాకపోకలు..
పలాస, టెక్కలి డివిజన్ పరిధిలోని 12 మండలాల ప్రజలు కాశీబుగ్గ బస్టాండ్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు బస్సులు ఆగుతాయి. అందుకే నిత్యం జన రద్దీతో ఉంటుంది ఈ బస్టాండ్. 2003లో మునిసిపల్ చైర్మన్గా వజ్జ బాబూరావు ఎన్నికయ్యారు. 2004లో సాధారణ నిధులు రూ.15 లక్షలతో బస్టాండ్ ప్రాంగణంలో ఆక్రమణలు తొలగించి ప్లాట్ఫారం ఏర్పాటు చేశారు. ప్రయాణికులు వేచిఉండే వీలుగా బెంచీలు, కుర్చీలు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు బస్సుల వేళలు తెలిపేవిధంగా ఆర్టీసీ ఎంక్వయిరీ కౌంటర్కు చిన్న గది, ట్రాఫిక్ను నియంత్రించేందుకు వీలుగా పోలీస్ సిబ్బందికి ఒక గదిని నిర్మించారు. 2005లో ఈ బస్టాండ్ ప్రారంభమైంది. రెండు దశాబ్దాలు దాటడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. పైగా మునిసిపల్ అధికారులు అనాలోచిత నిర్ణయం శాపంగా మారింది. ఇప్పటికే భవనం శిథిలావస్థకు చేరగా..మేడపై పిల్లర్స్ వేసి శ్లాబు వేశారు. దానిని ఏళ్ల తరబడి వృథాగా విడిచిపెట్టారు. దీంతో శ్లాబు పెచ్చులూడి ప్రయాణికులపై పడుతున్నాయి. ఆపై మెట్లు సైతం పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కనీసం బస్టాండ్ నిర్వహణపై మునిసిపల్ యంత్రాంగం దృష్టిపెట్టిన దాఖలాలు లేవు. అసలే వర్షాకాలం ..నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్లో ఏ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన ప్రయాణికుల్లో ఉంది. ఇప్పటికైనా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.
ప్రయాణికుడికి గాయాలు..
శనివారం కురిసిన చిరుజ ల్లులకు బస్టాండ్ శ్లాబు పెచ్చులు ఊడి కిందపడా ్డయి. ఈ సమ యంలో అక్కడ ఉన్న ఓ ప్రయాణి కుడు గాయాల పాలయ్యాడు. దీంతో మిగతా ప్రయాణి కులు భయంతో పరుగులు తీశారు.
దృష్టిపెడతాం..
కాశీబుగ్గ బస్టాండ్ విషయంపై ఉన్నతాధికారుల కు నివేదించాం. వీలైనంత వరకూ మరమ్మతులు చేపడతాం. ఇంతకుముందే మరమ్మతులకు రూ.6ల క్షలు మంజూరు చేశాం. టెండర్ ప్రక్రియ కూడా జరిగింది. కాంట్రాక్టర్ ఆలస్యం చేయడంతో పనులు ఆగాయి. పది రోజుల్లో పనులు ప్రారంభిస్తాం.
-శ్రీనివాసులు, కమిషనర్ పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ