వృద్ధురాలి హత్య వెనుక పాత్రధారులెవరు?
ABN , Publish Date - Aug 25 , 2026 | 12:36 AM
Raids on woman lawyer's house జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన చింతు చిన్నమ్మడు(70) అనే వృద్ధురాలి హత్య కేసుకు సంబంధించి పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. నోటరీ కోసం ఈ నెల 17న నరసన్నపేట వచ్చిన ఆ వృద్ధురాలు అదృశ్యమైంది.
పోలీసుల ముమ్మర దర్యాప్తు
మహిళా న్యాయవాది ఇంట్లో సోదాలు
మరికొంతమంది అనుమానితుల విచారణ
నరసన్నపేట, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన చింతు చిన్నమ్మడు(70) అనే వృద్ధురాలి హత్య కేసుకు సంబంధించి పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. నోటరీ కోసం ఈ నెల 17న నరసన్నపేట వచ్చిన ఆ వృద్ధురాలు అదృశ్యమైంది. 22న హిరమండలం సమీపాన పిండ్రువాడ గెడ్డలో ఓ మూటలో ఆమె మృతదేహం బయటపడిన విషయం తెలిసిందే. కాగా.. ఆమె ధరించిన బంగారు ఆభరణాలను దోపిడీ చేసి.. దుండగలు హతమార్చారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు. ఆ రోజు నరసన్నపేటలోని గవర్నమెంట్ ఆస్పత్రి రోడ్డులో ఒక మహిళా న్యాయవాది ఇంటికి నోటరీ కోసం వెళ్లినట్టు గుర్తించారు. ఆ తర్వాత ఆమె ఆచూకీ లేకపోవడం.. ఫోన్ కూడా పనిచేయకపోవడం.. బంగారు ఆభరణాలు మాయమవడం.. ఆరు రోజుల తర్వాత గెడ్డలోని ఓ మూటలో విగతజీవిగా బయటపడడం వెనుక కారకులు ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. సోమవారం మహిళా న్యాయవాది ఇంట్లో సోదాలు చేశారు. క్లూస్టీమ్ను కూడా రంగంలోకి దించారు. కీలక ఆధారాలు సేకరించినట్టు తెలిసింది.
2007లో నరసన్నపేటలో పక్కింట్లో నివసిస్తున్న టైలర్ దంపతుల హత్య వ్యవహారంలో మహిళా న్యాయవాదిపై కేసు నమోదైంది. తాజాగా వృద్ధురాలి హత్య ఘటన నేపథ్యంలో ఆ మహిళా న్యాయవాది ఫోన్ డేటా ఆధారంగా పోలీసులు ఆమె కదలికలపై నిఘా పెట్టారు. మహిళ న్యాయవాదితోపాటు ఆమె కుమారుడు ఫోన్ డేటా ఆధారంగా ఈ హత్యకు సంబంధం ఉన్నట్లు నిర్ధారించారు. ఎక్కడ హత్య చేశారు.. దానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.