గిరిజనులకు రాజ్యాంగ ఫలాలు అందాలి
ABN , Publish Date - Mar 24 , 2026 | 11:57 PM
గిరిజనులకు రాజ్యాంగ ఫలాలు సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి అన్నారు.
ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయండి
రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి
శ్రీకాకుళం కలెక్టరేట్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): గిరిజనులకు రాజ్యాంగ ఫలాలు సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి అన్నారు. కలెక్టరేట్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన మంగళవారం జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని గిరిజనుల సమస్యలు, వారి సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా బొజ్జిరెడ్డి మాట్లాడుతూ.. ఎస్టీలపై దాడుల విషయంలో పోలీసుశాఖ అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఎస్పీని ఆదేశించారు. గిరిజన ఉద్యోగులను పని ప్రదేశాల్లో వేధింపులకు గురిచేస్తే సహించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఐటీడీఏ పరిధిలో జరిగే పనుల్లో గిరిజనులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విధ్యార్థుల డ్రాపౌట్స్ లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పెండింగ్లో ఉన్న ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, గిరిజన గ్రామాల్లో తాగునీటి సౌకర్యం, ఉపాధి కూలీలకు నీడ కల్పించాలని, తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పొందిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది జిల్లాలో ఎస్టీలపై దాడులకు సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అన్నారు. కలెక్టర్, ఐటీడీఏ పీవోతో కలిసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యుడు మల్లేశ్వరరావు, ఐటీడీఏ పీవో స్వప్నిల్ పవార్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్కుమార్, డీఆర్వో లక్ష్మణమూర్తి, గిరిజన సంక్షేమాధికారి ఎం.అన్నాదొర, గిరిజన సంఘాల నేతలు చౌదరి లక్ష్మీనారాయణ, గేదెల రమణమూర్తి, బిడ్డిక తేజేశ్వరరావు, సవర కుమారి, సవర తులసి, ధరణి బైరిసింగి, బి.పాపారావు తదితరులు పాల్గొన్నారు.