రేపు పాలిసెట్
ABN , Publish Date - Apr 24 , 2026 | 12:12 AM
Policet in 42 centers పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికిగాను జిల్లాలోని 42 కేంద్రాల్లో ఈ నెల 25న పాలిసెట్ నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (శ్రీకాకుళం) ప్రిన్సిపాల్, జిల్లా సమన్వయకర్త డాక్టర్ కె.నారాయణరావు తెలిపారు.
42 కేంద్రాల్లో నిర్వహణకు ఏర్పాట్లు
ఎచ్చెర్ల, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికిగాను జిల్లాలోని 42 కేంద్రాల్లో ఈ నెల 25న పాలిసెట్ నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (శ్రీకాకుళం) ప్రిన్సిపాల్, జిల్లా సమన్వయకర్త డాక్టర్ కె.నారాయణరావు తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ ఆఫీసర్లు, పరిశీలకులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘జిల్లాలో శ్రీకాకుళం, టెక్కలి, పలాసలో మూడు ప్రధాన ప్రాంతీయ కేంద్రాలుగా పాలీసెట్ నిర్వహిస్తున్నాం. మొత్తం 11,855 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ఉదయం 11 నుంచి 1 గంట వరకు జరిగే ఈ పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోనికి అనుమతించం. విద్యార్థులను ఉదయం 9 గంటల నుంచే కేంద్రంలోకి అనుమతిస్తాం. విద్యార్థులు హాల్టికెట్, ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాల’ని జిల్లా సమన్వయకర్త నారాయణరావు తెలిపారు. పాలీసెట్ జిల్లా పరిశీలకుడు డాక్టర్ ఎంఏవీ రామకృష్ణ వర్చువల్ విధానంలో నిర్వాహకులతో మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా సహాయ సమన్వయకర్త డాక్టర్ మురళీకృష్ణ, టెక్కలి సమన్వయకర్త నర్శింహం పాల్గొన్నారు.