ఇదేంది మాస్టారూ..!
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:18 AM
మండలం లో ఇటీవల మందపల్లి ఆశ్రమ పాఠశాలలో ఒక ఉపాధ్యాయురాలు విద్యార్థులచే కాళ్లు నొక్కించు కున్న ఘటన మరువక ముందే నరసంద్ర పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు పనివేళల్లో నిద్రపోతుండడం చర్చనీయాంశంగా మారింది.
తరగతి గదిలో టేబుల్పై కాలువేసి నిద్రపోతున్న ఉపాధ్యాయుడు
మెళియాపుట్టి, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): మండలం లో ఇటీవల మందపల్లి ఆశ్రమ పాఠశాలలో ఒక ఉపాధ్యాయురాలు విద్యార్థులచే కాళ్లు నొక్కించు కున్న ఘటన మరువక ముందే నరసంద్ర పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు పనివేళల్లో నిద్రపోతుండడం చర్చనీయాంశంగా మారింది. పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయుడు ప్రతి రోజూ తరగతి గదిలో నిద్రపోతుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. నడసంద్ర ఒడియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 110 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ఓ ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పకుండా నిద్రపోతున్నట్టు విద్యార్థులు చెబుతున్నారు. ఏడాది నుంచి ఇదే పరిస్థితి ఉండగా.. తీరు మార్చుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించారు. అయినా ఆ మాస్టారులో మార్పు రాలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరగతి గదిలో టేబుల్పై కాలు పెట్టుకుని నిద్రపోతున్నట్టు విద్యార్థులు చెబుతున్నారు. దీనిపై ఎంఈవో మల్లారెడ్డి పద్మనాభం మాట్లాడుతూ.. ‘అతడు కొన్నాళ్లగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఇలా నిద్రపోతున్నాడు. గతంలో ఈ విషయంపై ఆయనను హెచ్చరించాము. అనారోగ్యం వల్లే ఇలా నిద్రపోతున్నారు’ అని స్పష్టం చేశారు.