రైతుల సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:54 PM
రైతుల సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయమని పీయూసీ చైర్మన్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు.
సరుబుజ్జిలి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయమని పీయూసీ చైర్మన్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. రొట్టవలసలో ఈనాం భూములను సాగుచేస్తున్న 200 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఇటీవల రూ.14 వేలు చొప్పున ఖాతాల్లో నేరుగా జమ చేశారు. దీంతో రైతులు ఎంపీటీసీ మాజీ సభ్యుడు తాడేల వెంకటరమణ, నియోజకరవర్గ తెలుగు యువత అధ్యక్షుడు తాడేల రాజారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రవికుమార్ను గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ రొట్టవలసకు చెందిన పలువురు రైతులు తాము ఈనాం భూములు సాగుచేస్తున్నా ప్రభుత్వ పథ కాలు అందలేదని తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఈమేరకు రొట్టవలసతో పాటు నియోజకవర్గంలోని మరో ఎనిమిది గ్రామాలకు చెందిన 1200 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ప్రయోజనం కల్పించామన్నారు. అనంతరం బురిడివలస, మర్రిపాలెంలో పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో పావని, తహసీల్దార్ జగదీష్, డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వ ప్రసాదరావు, నాయకులు అంబళ్ల రాంబాబు, పల్లి సురేష్, లావేటి పూర్ణారావు, పైడి మురళీమోహన్ పాల్గొన్నారు.