మార్కెట్ కమిటీల బలోపేతమే లక్ష్యం
ABN , Publish Date - Jul 09 , 2026 | 11:40 PM
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు స్థానిక రైతులకు అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పనే ధ్యేయంగా మార్కెట్ కమిటీలను బలోపేతం చేస్తున్నట్టు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు.
నరసన్నపేట, జూలై 9(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు స్థానిక రైతులకు అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పనే ధ్యేయంగా మార్కెట్ కమిటీలను బలోపేతం చేస్తున్నట్టు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. గురువారం స్థానిక మార్కెట్ కమిటీ ఆవరణలో రూ.49లక్షలతో అంతర్గత రోడ్లు, ప్రహరీ నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ కమిటీ స్థలాన్ని ఆక్రమణలకు గురికాకుండా కాపాడేందుకు, రైతుల సరకులకు భద్రత కల్పించేవిధంగా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. దళారీ వ్యవస్థలను నిర్మూలించి పారదర్శకమైన వ్యాపార వాతావరణాన్ని సృష్టించేందుకు మార్కెట్ కమిటీలను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాళింగ కార్పొరేషన్ చైర్మన్ రోణంకి కృష్ణంనాయుడు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పాగోటి ఉమామహేశ్వరి, నరసన్నపేట, పోలాకి వంశధార డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు శిమ్మ చంద్రశేఖర్, ఎంవీ నాయుడు, పోలాకి, నరసన్నపేట పీఏసీఎస్ అధ్యక్షులు బైరి భాస్కరరావు, ఇసా అప్పారావు, కళింగ కోమటి కార్పొరేషన్ డైరెక్టర్ జామి వెంకటరావు, కింజరాపు రామారావు, గొద్దు చిట్టిబాబు, సాసుపల్లి కృష్నబాబు, బలగ ప్రహర్ష తదితరులు పాల్గొన్నారు. అనంతరం పట్టణానికి చెందిన యువశాస్త్రవేత్త ఎం.భానుచందర్ను అభినందించారు.