శతశాతం అక్షరాస్యతే లక్ష్యం
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:42 PM
Hundred percent literacy జిల్లాలో శతశాతం అక్షరాస్యతే లక్ష్యమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. అక్షరాంధ్ర (ఉల్లాస్) కార్యక్రమంలో భాగంగా అరసవల్లిలో ఏర్పాటు చేసిన ప్రాథమిక స్థాయి అక్షరాస్యత పరీక్ష కేంద్రాన్ని ఆయన ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, మార్చి 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శతశాతం అక్షరాస్యతే లక్ష్యమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. అక్షరాంధ్ర (ఉల్లాస్) కార్యక్రమంలో భాగంగా అరసవల్లిలో ఏర్పాటు చేసిన ప్రాథమిక స్థాయి అక్షరాస్యత పరీక్ష కేంద్రాన్ని ఆయన ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అభ్యాసకుల హాజరును, పరీక్షల తీరును పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ‘జిల్లా వ్యాప్తంగా 1,462 కేంద్రాల్లో 1,13,102మంది అభ్యాసకులు ఈ పరీక్షకు హాజరయ్యేలా విస్తృత ఏర్పాట్లు చేశాం. అంగన్వాడీ కార్యకర్తలు, వెలుగు వీఓఏలు, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఇన్విజిలేటర్లుగా ఈ పరీక్షల ప్రక్రియ జరుగుతోంద’ని తెలిపారు. పరీక్ష ముగిసిన వెంటనే మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేసి, అభ్యాసకులు సాధించిన మార్కులను గ్రామ, వార్డు సంక్షేమ సహాయకులు ‘అక్షరాంధ్ర’ యాప్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఐసీడీఎస్, మెప్మా, డ్వామా, రెవెన్యూ ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల నోడల్ అధికారులు, మండలస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.