రథసప్తమి వేడుకల్లో భక్తుల సౌకర్యానికే ప్రాధాన్యం
ABN , Publish Date - Jan 05 , 2026 | 11:41 PM
During the Rathasaptami celebrations అరసవల్లిలో ఈ నెల 19 నుంచి వారం రోజులపాటు నిర్వహించనున్న రథసప్తమి వేడుకల్లో భక్తుల సౌకర్యానికే ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం అరసవల్లిలో ఏర్పాట్లను ఎస్పీ మహేశ్వరరెడ్డితో కలిసి పరిశీలించారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
ఎస్పీతో కలిసి ఏర్పాట్లు పరిశీలన
అరసవల్లి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): అరసవల్లిలో ఈ నెల 19 నుంచి వారం రోజులపాటు నిర్వహించనున్న రథసప్తమి వేడుకల్లో భక్తుల సౌకర్యానికే ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం అరసవల్లిలో ఏర్పాట్లను ఎస్పీ మహేశ్వరరెడ్డితో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ‘భక్తుల సౌకర్యార్థం ఉచిత దర్శనం, దివ్యాంగుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలి. తిరుపతి దేవస్థానంలో మాదిరి స్వామిని కొంతదూరం నుంచే భక్తులు దర్శించుకునేలా చూడాలి. సామాన్య భక్తులకు మరింత శీఘ్రంగా దర్శనం లభించేలా చర్యలు తీసుకోవాలి. మూడు చోట్ల ప్రసాదాల కౌంటర్లతోపాటు అన్ని ప్రదేశాల్లో సూచికల బోర్డులను ఏర్పాటు చేయాల’ని ఆదేశించారు. మూడు క్యూలైన్లలో స్వామిని దర్శించునేలా ఏర్పాటు చేశామని ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్ తెలిపారు. స్వామి దర్శనం తర్వాత భక్తులు బయటకు వెళ్లేందుకు వీలుగా ఆలయానికి దక్షిణాన మార్గం కూడా తెరిచామన్నారు.
ఎస్పీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ సామాన్య భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా దర్శన ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్కు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో వేడుకలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో రథసప్తమి వేడుకల ప్రత్యేక అధికారి శోభారాణి, డీఎస్పీ వివేకానంద, సుడా ఈఈ పొగిరి సుగుణాకరరావు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.