ఆ భూమిని పేదలకు ఇవ్వాలి
ABN , Publish Date - Jul 09 , 2026 | 11:52 PM
Protest by villagers of Jeerupalem ‘ప్రభుత్వ భూమిని ప్రజాప్రయోజనాలకు వినియోగించాలి. పేదలకు పంపిణీ చేయాల’ని జీరుపాలెం గ్రామస్థులు డిమాండ్ చేశారు.
జీరుపాలెం, జగన్నాథపురం గ్రామస్థుల డిమాండ్
రణస్థలం, జూలై 9(ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వ భూమిని ప్రజాప్రయోజనాలకు వినియోగించాలి. పేదలకు పంపిణీ చేయాల’ని జీరుపాలెం గ్రామస్థులు డిమాండ్ చేశారు. రణస్థలం మండలంలోని జీరుపాలెం, జగన్నాథపురంలో సుమారు 18 ఎకరాల ప్రభుత్వ భూములను కొంతమంది ఆక్రమించి.. తమపేరిట పట్టాలు రాయించుకున్నారు. ఈ భూములను పేదలకు కేటాయించాలని, ఆ పట్టాలు రద్దు చేయాలని జీరుపాలెం, జగన్నాథపురం గ్రామస్థులు కోరుతున్నారు. ఈ మేరకు బుధవారం తహసీల్దార్ సనపల కిరణ్కుమార్కు వినతిపత్రాన్ని అందజేశారు. గురువారం కూడా ఈ భూముల వ్యవహారంపై న్యాయం చేయాలని జీరుపాలెంలో ఆందోళన చేపట్టారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి ఆ భూములను పరిశీలించారు. తహసీల్దార్ ఎస్.కిరణ్కుమార్, ఎస్ఐ చిరంజీవి తదితరులు జీరుపాలెం చేరుకుని పరిస్థితి సమీక్షించారు. కాగా.. కొంతమంది ప్రభుత్వ భూమిని పట్టాలుగా పొందారని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆ పట్టాలు రద్దు చేయాలని ఆయా గ్రామస్థులు మరోసారి డిమాండ్ చేశారు. వాస్తవాలను పరిశీలించి ఈ భూములను పేదలకు పంపిణీ చేయాలని కోరారు. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి న్యాయం చేస్తామని తహసీల్దార్ కిరణ్కుమార్ నచ్చజెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు.