ఆటపాటలతో బోధన
ABN , Publish Date - Feb 12 , 2026 | 11:58 PM
Moderen teaching పాఠశాల ప్రాంగణం చుట్టూ పచ్చని వాతావరణం. మరోవైపు ఆకర్షణీయమైన తరగతి గదులు.. ఇంకోవైపు విద్యార్థులకు అర్థమయ్యేరీతిలో ఆటపాటలు.. బొమ్మల ద్వారా బోధన. ఇదీ మెళియాపుట్టి మండలంలోని దీనబంధుపురంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రత్యేకత.
కూరగాయల సాగుపై అవగాహన
మెళియాపుట్టి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): పాఠశాల ప్రాంగణం చుట్టూ పచ్చని వాతావరణం. మరోవైపు ఆకర్షణీయమైన తరగతి గదులు.. ఇంకోవైపు విద్యార్థులకు అర్థమయ్యేరీతిలో ఆటపాటలు.. బొమ్మల ద్వారా బోధన. ఇదీ మెళియాపుట్టి మండలంలోని దీనబంధుపురంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రత్యేకత. ఒకప్పుడు మారుమూల గిరిజన గ్రామమైన ఈ పాఠశాలలో సౌకర్యాలు లేక విద్యార్థులంతా పక్క గ్రామాల్లో ప్రైవేటు పాఠశాలను ఆశ్రయించేవారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. విద్యాశాఖలో సంస్కరణలు చేపట్టి.. సౌకర్యాలు కల్పించారు. దీంతో ఆ గ్రామంతోపాటు పక్క గ్రామస్థుల విద్యార్థులు కూడా ఆ పాఠశాలలో చేరారు. నేడు కార్పొరేట్కు దీటుగా బోధన సాగిస్తున్నారు. ఆటపాటలతో మెరుగైన విద్యతోపాటు సౌకర్యాలు కూడా కల్పించడంతో విద్యార్థులు మరింత ఆకర్షితులవుతున్నారు. ఈ పాఠశాలలో 36 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రధానోపాధ్యాయుడు జె.సంపత్కుమార్ వినూత్న పద్ధతులతో పిల్లలకు బోధన సాగిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ‘ముస్తాబు’ కార్యక్రమం ద్వారా చక్కగా ముస్తాబైన విద్యార్థులను అభినందించి బహుమతులు అందజేస్తున్నారు. పాఠశాల ఆవరణలో కూరగాయలు కూడా పండిస్తూ.. సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల గ్రామస్థుల సహకారంతో పాఠశాలలో సరస్వతీ దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అందరి సహకారంతో పాఠశాలను అభివృద్ధి చేస్తూ.. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంచేలా ఆట, పాటలతో బోధన సాగిస్తున్నామని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.