శ్రీకాకుళం ప్రగతి పరుగు
ABN , Publish Date - May 17 , 2026 | 12:10 AM
అన్ని రంగాల్లోనూ శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం కనబరుస్తున్న ఉత్తమ ప్రతిభ ఎంతో ప్రశంసనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. ప్రత్యేకించి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నాయకత్వంలో జిల్లా సాధిస్తున్న ప్రగతి అద్భుతంగా ఉందన్నారు.
కలెక్టర్కు సీఎం చంద్రబాబు ప్రత్యేక అభినందన
రాష్ట్ర, జోనల్ సగటును మించి రాణించినజిల్లా యంత్రాంగం
తాజా నివేదికలో జోన్-1లో ప్రథమ, రాష్ట్రంలో 4వ స్థానం
ఆర్టీసీ, రవాణా శాఖల్లో ప్రజా సంతృప్తి పెరగాలి
నరసన్నపేట ‘ప్రజావేదిక’లోముఖ్యమంత్రి చంద్రబాబు విశ్లేషణ
శ్రీకాకుళం, మే 16 (ఆంధ్రజ్యోతి): అన్ని రంగాల్లోనూ శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం కనబరుస్తున్న ఉత్తమ ప్రతిభ ఎంతో ప్రశంసనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. ప్రత్యేకించి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నాయకత్వంలో జిల్లా సాధిస్తున్న ప్రగతి అద్భుతంగా ఉందన్నారు. శనివారం నరసన్నపేటలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ ప్రజావేదిక సభలో ఆయన జిల్లా ప్రగతి నివేదికను విశ్లేషించి.. అధికారులను అభినందించారు. అధికారులు ఎల్లప్పుడూ ప్రజా సానుకూల దృక్పథాన్ని పెంపెందిం చుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి, జోనల్ సగ టులతో ప్రతి ప్రభుత్వ విభాగాన్ని పోలుస్తూ ప్రగతిని వివరించడంతో పాటు పలు కీలక సూచనలు చేశారు.
గణాంకాల్లో జిల్లా ముందంజ...
సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో జిల్లా గణాంకా లను ప్రస్తావిస్తూ.. రాష్ట్ర సగటు స్కోరు 69.19, జోన్-1 సగటు స్కోరు 69.84గా ఉండగా, శ్రీకాకుళం జిల్లా వార్షిక డేటాలో 70.29 స్కోరుతో జోన్లో 3వ స్థానం, రాష్ట్రంలో 10వ స్థానంలో నిలిచిందన్నారు. మే 8 నాటి తాజా నివేదిక ప్రకారం ఏకంగా 75.02 స్కోరు సాధించి, జోన్-1లోని 6 జిల్లాల్లో ప్రథమ, రాష్ట్ర వ్యాప్తం గా 4వ స్థానాన్ని కైవసం చేసుకోవడంపై కలెక్టర్ను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా పరిధిలోని మొత్తం 50 ప్రచార కార్యక్రమాలతో మెజారిటీ విభాగాలు రాష్ట్ర సగటు కంటే అత్యుత్తమంగా పనిచేస్తున్నాయన్నారు.
అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విభాగాలు...
భూముల రీసర్వే: ఈ ప్రక్రియలో జిల్లా యంత్రాంగం రాష్ట్ర సగటు (71.46)కంటే +9.89 శాతం ఆధిక్యంతో 81.35 స్కోరు సాధించగా, తాజా నివేదికలో ఇది మరిం త మెరుగై 85.96కి చేరింది. ఎఫ్-లైన్ సర్వే, ఆర్ఓఆర్ సర్వేల్లో సైతం జిల్లా ముందంజలో ఉంది.
విద్య, సంక్షేమం: బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠ శాలలు (80.19), స్కూల్ ఎడ్యుకేషన్ (83.98), గిరిజన, సాంఘిక సంక్షేమ వసతి గృహాల నిర్వహణ అద్భుతంగా ఉంది.
మహిళా, శిశు సంక్షేమం: గర్భిణులు, బాలింతలు, 6 నుంచి 36 నెలల పిల్లల సంరక్షణ-పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాల్లో జిల్లా 83 శాతానికి పైగా స్కోరు సాధిం చింది. ప్రభుత్వ ఆసుపత్రుల సేవలు, అన్న క్యాంటీన్ల నిర్వహణ కూడా రాష్ట్ర సగటు కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయి.
రవాణా, ఆర్టీసీ శాఖలు శ్రద్ధ వహించాలి
ఇదే సమయంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ), రవాణా శాఖలు తమ పరిధిలో ప్రజల సం తృప్తి స్థాయిని మరింత పెంచాల్సి ఉంటుందని ముఖ్య మంత్రి స్పష్టంగా చెప్పారు. ఆర్టీసీ బస్ స్టేషన్ల సేవల స్కోరు (55.70), రవాణా శాఖ పన్నుల వసూళ్ల స్కోరు (63.11) రాష్ట్ర సగటు కంటే వెనుకబడి ఉన్నా యని, ఈ రవాణా విభాగాలు ప్రత్యేక శ్రద్ధ వహించా లన్నారు. లైసెన్సుల మంజూరు ప్రక్రియలో వెనుకంజలో ఉండ డంతో ఈ విషయంలో సంబంధిత అధికారిని సీఎం సుతిమెత్తగా హెచ్చరించారు. వీటితోపాటు గ్రామీణ తాగునీటి సరఫరా, రోడ్ల గుంతల పూడ్చివేత అంశా లలో జిల్లా స్థాయి సగటు తక్కువగా ఉందని, సంబం ధిత అఽధికారులు తక్షణం లోపాలను సవరించుకోవా లన్నారు. నరసన్నపేట నియోజకవర్గం వార్షికంగా 24 కార్యక్రమాల్లో రాష్ట్ర సగటు కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ, తాజా నివేదిక ప్రకారం కొన్ని సేవల్లో వెనుకబాటు కనిపిస్తోందని, ఇక్కడి అధికారులు మరింత పట్టుదలగా పనిచేసి నియోజకవర్గాన్ని, జిల్లాను రాష్ట్రంలోనే అగ్ర గామిగా నిలపాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అనంతరం, వారి వారి విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కన బరిచిన అధికారులను ముఖ్యమంత్రి అభినందించి ఉత్సాహ పరిచారు.