బడి పిలుస్తోంది
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:23 AM
Strengthening government schools జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమే లక్ష్యంగా.. రానున్న విద్యాసంవత్సరంలో అధికశాతం విద్యార్థులను చేర్చేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా..
గ్రామాల్లో ఉపాధ్యాయుల విస్తృత ప్రచారం
గుజరాతీపేట, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమే లక్ష్యంగా.. రానున్న విద్యాసంవత్సరంలో అధికశాతం విద్యార్థులను చేర్చేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ.. విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, బోధనపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో 1,917 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 147 ప్రాథమికోన్నత, 360 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 1,34,687 మంది విద్యార్థులు చదువుతున్నారు. అలాగే కేజీబీవీలు, ఏపీఎస్ డబ్ల్యూఆర్ఎస్, ఏపీఎంఎస్, ఏకలవ్య తదితర పాఠశాలల్లో మరో 24,353 మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకుగాను.. ఈ నెల 17 నుంచి ఉపాధ్యాయులు.. గ్రామాలు, పట్టణాల్లో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలను బడిలో చేర్పించేందుకు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాలల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఇంటింటా సర్వే చేశారు. మంగళవారం కూడా ఈ ప్రక్రియ కొనసాగనుంది. 23న ఆయా పాఠశాలల్లో అడ్మిషన్లు నమోదు చేయనున్నారు. జిల్లాలో పలు మండలాల్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డీఈవో పర్యటించి.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నారు.