ప్రజాసేవలో రెవెన్యూ శాఖ కీలకం
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:29 AM
Public service in Revenue ప్రజలకు సేవలు అందించే విషయంలో రెవెన్యూ శాఖ కీలకమని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వేంకటేశ్వర్లు అన్నారు. సోమవారం శ్రీకాకుళంలోని రెవెన్యూ గెస్ట్హౌస్లో విలేకరులతో ఆయన మాట్లాడారు.
ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వేంకటేశ్వర్లు
అరసవల్లి, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): ప్రజలకు సేవలు అందించే విషయంలో రెవెన్యూ శాఖ కీలకమని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వేంకటేశ్వర్లు అన్నారు. సోమవారం శ్రీకాకుళంలోని రెవెన్యూ గెస్ట్హౌస్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘ఒకప్పుడు రెవెన్యూ ఉద్యోగులు సాధారణ ఎన్నికల సమయంలో, తుఫాన్లు సంభవించినప్పుడు యుద్ధప్రాతిపదికన పనిచేసేవారు. కానీ నేడు నిత్యం పని ఒత్తిడిలో ఉంటున్నారు. తహసీల్దార్లు మండల కార్యాలయాల్లో తగినంత సమయం అందుబాటులో ఉండలేకపోతున్నారు. గత ప్రభుత్వం నిర్వహించిన రీసర్వేలో చాలా తప్పులు దొర్లాయి. వాటిని సరిచేసే అధికారం తహసీల్దార్లకు లేదు. ఇప్పుడు చంద్రబాబు తహసీల్దార్లకు 10 రకాల అధికారాలు ఇచ్చారు. పాసు పుస్తకాలు సరిచేసే బాధ్యత నేడు తహసీల్దార్లపై ఉంది. దీంతో వారిపై మరింత పని ఒత్తిడి పెరగనుంది. ప్రస్తుతం గ్రామాల్లో 5వ దశ రీసర్వే జరుగుతోంది. ఇందులో వివాదాస్పద గ్రామాలు ఉంటాయి. గ్రేడ్-2, గ్రేడ్-3 ఉద్యోగులను తహసీల్దారు పరిధిలోని తీసుకుని రావాలి. ఈ అంశాన్ని ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి. పాసు పుస్తకాల్లో తప్పులు సరిదిద్దాలంటే సమయం పడుతుంది. ఈ విషయమై సిబ్బందికి వర్క్షాపు నిర్వహించాలి. అప్పుడే క్షేత్రస్థాయిలో సమస్యలు ఉన్నతాధికారులకు తెలుస్తాయి. తహసీల్దార్ల కార్యాలయాల్లో సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల’ని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బీవీవీఎన్.రాజు, కార్యదర్శి సోనీకిరణ్, గణపతిరావు, బి.గోపాల్, బి.సత్యం, పద్మావతి, అరుణకుమార్, శ్రీనివాసరావు, మురళీధర నాయక్ పాల్గొన్నారు.