శ్రీకూర్మనాథుడ్ని స్మరిస్తూ..
ABN , Publish Date - Aug 02 , 2026 | 12:35 AM
The airport at Bhogapuram was inaugurated శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకూర్మనాథుడ్ని స్మరిస్తూ ప్రధాని నరేంద్రమోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. శనివారం విజయనగరం జిల్లా భోగాపురంలో ‘అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు’ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, మంత్రి నారా లోకేశ్తో కలిసి ప్రధానమంత్రి మోదీ జాతికి అంకితం చేశారు.
ప్రధాని ప్రసంగం ప్రారంభం
మూలపేట, రామయపట్నం పోర్టులు త్వరలో పూర్తిచేస్తామని హామీ
65 ఏళ్ల నేరడిబ్యారేజీ సమస్యను పరిష్కరించాం: సీఎం చంద్రబాబు
గోదావరి-వంశధార అనుసంధానంపై ప్రస్తావన
శ్రీకాకుళం, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకూర్మనాథుడ్ని స్మరిస్తూ ప్రధాని నరేంద్రమోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. శనివారం విజయనగరం జిల్లా భోగాపురంలో ‘అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు’ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, మంత్రి నారా లోకేశ్తో కలిసి ప్రధానమంత్రి మోదీ జాతికి అంకితం చేశారు. ముందుగా ‘అందరికీ నమస్కారం అంటూ.. శ్రీకూర్మనాథుడ్ని స్మరిస్తూ’ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి హిందీలో మాట్లాడగా... వేదికపై నుంచే కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు అనువాదం చేసి తెలుగులో ప్రజలకు వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టును, రామాయపట్నంలో పోర్టును అతి త్వరలో పూర్తిచేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. అంతకు ముందు రూ.18000 కోట్లకు సంబంధించిన పలు పనులకు అక్కడ నుంచే శంకుస్థాపన చేసి ప్రారంభించారు. పీఎం గతిశక్తి పథకం ద్వారా పోర్టులను, ఎయిర్పోర్టులను అనుసంధానం చేసి.. ఉత్తరాంరఽధను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు.
త్వరలో ‘నేరడి’ పనులు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. ‘శ్రీకాకుళం జిల్లా రైతులకు అత్యంత ప్రయోజనం చేకూర్చగలిగే నేరడి బ్యారేజీ విషయమై 65 ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. గోదావరి-వంశధార నదుల అనుసంధానం పూర్తిచేస్తాం. ఉత్తరాంధ్ర నుంచి.. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుంచి వలసలు పోకుండా.. ఇక్కడకు వలసలు వచ్చేలా అభివృద్ధి చేస్తామ’ని తెలిపారు.
ఉత్తరాంధ్ర బిడ్డగా గర్వకారణం
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ‘ఉత్తరాంధ్ర బిడ్డగా 2014-2019 మధ్యకాలంలో అప్పటి విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతి ఆధ్వర్యంలో భోగాపురం విమానాశ్రయానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీజం వేశారు. మళ్లీ ఇప్పుడు ఉత్తరాంధ్ర బిడ్డగా నేను విమానయానశాఖ మంత్రిగా ఉంటూ.. ఎయిర్పోర్టు పూర్తిచేయగలిగాం. ఎంతో గర్వకారణంగా ఉంది. ఇదంతా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కృషి వల్లనే సాధ్యమైంది. ఉత్తరాంధ్రలో అన్ని జిల్లాలు అభివృద్ధిలో పరుగులెడతాయ’ని తెలిపారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సతీమణి, రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్, ఎమ్మెల్యేలు గౌతు శిరీష, గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు, నడుకుదిటి ఈశ్వరరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కూటమి శ్రేణులు, జిల్లా నుంచి వేలాది మంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.