నిలిచిన రిజిస్ట్రేషన్లు
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:29 AM
జిల్లాలో భూములు, స్థలాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.
- రెండు రోజుల్లో జరిగినవి 39 మాత్రమే
- దస్తావేజు లేఖర్ల పెన్డౌన్ ఎఫెక్ట్
పొందూరు, జూలై 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూములు, స్థలాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ప్రభుత్వం తీసుకువచ్చిన 396 జీవోను వెనక్కి తీసుకోవాలని కోరుతూ దస్తావేజు లేఖర్లు రెండు రోజులుగా పెన్డౌన్ కార్యక్రమం చేపడుతుండడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రతిరోజూ వందలాది రిజిస్ట్రేషన్లు జరిగేవి. వాటిద్వారా ప్రభుత్వానికి రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు ఆదాయం సమకూరేది. అయితే, దస్తావేజు లేఖర్లు పెన్డౌన్ కార్యక్రమంలో ఉండడంతో డాక్యుమెంట్లు రాసేవారు లేక రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. జిల్లాలో సోమవారం కేవలం 39 రిజిస్ట్రేషన్లు జరగగా, మంగళవారం ఒక్కటి కూడా జరగలేదు. దీంతో ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఈ విషయమై జిల్లా రిజిస్ట్రార్ బి.సంజీవయ్యను వివరణ కోరగా జిల్లాలో సోమ, మంగళవారం రిజిస్ట్రేషన్లు బాగా తగ్గిపోయాయని తెలిపారు.